AP Govt: జీరో వేస్ట్ ప్రభుత్వ విధానం
ABN , Publish Date - May 16 , 2025 | 04:05 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యర్థాల సమర్థ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని, జీరో వేస్ట్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. డ్వాక్రా మహిళలకు తడి చెత్త ఎరువుగా మార్చే బాధ్యత అప్పగించి, సర్క్యులర్ ఎకానమీపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
వ్యర్థాల సమర్థ నిర్వహణతో గ్రామాలను స్వచ్ఛంగా మలచాలి
తడిచెత్తను ఎరువుగా మార్చేందుకు డ్వాక్రా మహిళలకు బాధ్యత
సర్క్యులర్ ఎకానమీపై సమీక్షలో చంద్రబాబు
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): వ్యర్థాల సమర్థ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గురువారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్టుగా మార్చేలా, పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. అలాగే తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో, అలాగే జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. చెత్తను గ్రేడింగ్ చేసి దానిని కావాల్సిన ఏజెన్సీలకు విక్రయించడమో? లేదా అక్కడ నుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకొచ్చి రోడ్లపై వేయడానికి వీల్లేదని చెప్పారు. వ్యర్థాల నిర్వహణ సమర్థంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబరు 2న అవార్డులు అందించాలని సూచించారు.
2026 అక్టోబరు 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు. జీరో వేస్ట్ అనేది మన లక్ష్యంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని చంద్రబాబు అన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పంచాయతీరాజ్ శాఖ సమన్వయం చేసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేసి చెత్తను సేకరించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. వ్యవసాయ వ్యర్థాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్థాలు సర్క్యులర్ ఎకానమీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలని సూచించారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ రూపొందించాలని ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీలో ముందున్న రాజస్థాన్ మోడల్ను పరిశీలించాలని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.