YSCP leader visit : పరామర్శ ఇలాగేనా?
ABN , Publish Date - Jan 10 , 2025 | 05:48 AM
తిరుపతి తొక్కిసలాట ఘటనలో పెనువిషాదంలో ఉన్న బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత జగన్.. తన పర్యటనను పరామర్శ పేరుతో పరిహాసం చేశారన్న విమర్శలు
జుగుప్సాకరంగా వైసీపీ శ్రేణుల ప్రవర్తన
మాట వరసకు కూడా వారించని జగన్
ఇదే సీన్లో కేడర్ అరిస్తే వారించిన పవన్
తిరుపతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుపతి తొక్కిసలాట ఘటనలో పెనువిషాదంలో ఉన్న బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత జగన్.. తన పర్యటనను పరామర్శ పేరుతో పరిహాసం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో ఉండగానే గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగన్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు హైవేలో ట్రాఫిక్ జామ్ కావడంతో కాసేపు కారు దిగి రోడ్డుపై నడిచి నాటకీయతకు తెరలేపారు. దీంతో వాహనాలు క్లియర్ చేయడానికి పోలీసులు తిప్పలు పడాల్సివచ్చింది. తర్వాత ఆయన కారెక్కి స్విమ్స్కు బయలుదేరుతుండగా తమ నాయకుడిని ఆస్పత్రికి రానివ్వకుండా కావాలనే అడ్డుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణులు స్విమ్స్ సర్కిల్లో నానాయాగీ చేశారు. పోలీసులు వారిని పంపేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జగన్ స్విమ్స్కు చేరుకున్నారు. అప్పటికే తరలించిన యువతతో ‘సీఎం..సీఎం...’ అంటూ వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేయించారు. జగన్తో పాటు వారంతా ఆస్పత్రి లోపలికి చొచ్చుకుపోయారు. సంబరాలకు వచ్చినట్టు ఊగిపోయారు.
ఐసీయూలో కూడా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వారు సెల్ఫీలు తీసుకుంటున్నా పట్టించుకోకుండా జగన్ పరామర్శ కొనసాగించారు. ఆయన వెంట వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, ఆర్కే రోజా, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తదితరులున్నారు. ఇదిలావుంటే జగన్ ఆస్పత్రి లోపల ఉండగా పవన్ బయట మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా గట్టిగా అరవడంతో జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే ఏమిటీ అరుపులు. దయచేసి మౌనంగా ఉండండి’ అని పవన్ చెప్పడంతో అందరూ సైలెంటయ్యారు. కాగా, జగన్ మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నప్పటికీ వారిని ఆయన ఏమాత్రం వారించలేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు.