Gadwal Case: హనీమూన్ మర్డర్లా దొరికిపోవద్దు
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:41 AM
అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.
మేఘాలయలో నిందితుల్లా కాకుండా.. మనం పక్కాగా చేయాలి
తేజేశ్వర్ హత్యకు ముందు ఐశ్వర్య, తిరుమలరావు ప్రణాళిక
గద్వాల కేసును ఛేధించిన పోలీసులు.. 8 మంది అరెస్టు
గద్వాల క్రైం, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ‘అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు. ఆ ఘటనలో హంతకులు ఏదో పొరపాటు చేసి పట్టుబడ్డారు. మనం మాత్రం ఎలాంటి పొరపాటు జరగకుండా పక్కాగా పనికానిచ్చేద్దాం’ తేజేశ్వర్ హత్యకు ఆయన భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు వేసుకున్న ప్రణాళిక ఇది!! తేజేశ్వర్ను చంపిన తర్వాత ఇద్దరూ లద్ధాఖ్కు హనీమూన్ వెళ్లాలనీ అనుకున్నారు.
ఒకవేళ అనుకోని కారణాల వల్ల హత్య ఆలస్యమైతే ఆషాఢమాసంలో అండమాన్ లేదా మరే ప్రాంతానికైనా విహారానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే తేజేశ్వర్ను చంపించినా పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యారు. తెలంగాణలోని గద్వాలకు చెందిన తేజేశ్వర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 8 మందిని అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం విలేకరులకు వెల్లడించారు.