Passport Office : మరింత వేగంగా పాస్పోర్టులు
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:20 AM
మరింత వేగంగా, ఎక్కువ సంఖ్యలో పాస్పోర్టులను జారీకి సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటున్నట్టు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారి శివహర్ష చెప్పారు.
2025-26లో 4 లక్షలు జారీ లక్ష్యం
గతేడాది 3.23 లక్షల పాస్పోర్టు సేవలు
13 సేవా కేంద్రాల్లో రోజూ 1,800 అపాయింట్మెంట్స్
విజయవాడ పాస్పోర్టు సేవాకేంద్రం విస్తరణ పూర్తి
రీజినల్ పాస్పోర్టు అధికారి శివహర్ష
విజయవాడ, జనవరి 4(ఆంధ్రజ్యోతి): మరింత వేగంగా, ఎక్కువ సంఖ్యలో పాస్పోర్టులను జారీకి సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటున్నట్టు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ అధికారి శివహర్ష చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో 4 లక్షల పాస్పోర్టులను జారీ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. శనివారం విజయవాడలోని పాస్పోర్టు సేవా కేంద్రంలో విలేకరుల సమావేశంలో శివహర్ష మాట్లాడారు. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 3,23,553 పాస్పోర్టు సంబంధిత సేవలను అందించినట్టు చెప్పారు. విజయవాడ, తిరుపతిలలో రెండు పాస్పోర్టు సేవాకేంద్రాలు(పీఎ్సకే), 13 పోస్టాఫీసు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పీఓపీఎ్సకే)ల ద్వారా రోజుకు 1,800 అపాయింట్మెంట్స్ ఇస్తున్నామని తెలిపారు. విజయవాడ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని విస్తరించటం పూర్తయిందని, 500 నుంచి 1,000 అపాయింట్మెంట్స్ నిర్వహించే స్థాయికి తీసుకువచ్చామన్నారు. ప్రతి బుధవారం స్పెషల్ డ్రైవ్ ద్వారా విజయవాడ పాస్పోర్టు సేవా కేంద్రం పరిధిలోనే అదనంగా 250 అపాయింట్మెంట్స్ అదనంగా ఇస్తున్నామని తెలిపారు. విజయవాడలో ప్రత్యేక పాస్పోర్టు కార్యాలయ విస్తరణ పూర్తయిందని, త్వరలో ప్రారంభిస్తామన్నారు. విజయవాడలోనే పాస్పోర్టుల ముద్రణ చేస్తున్నట్టు చెప్పారు.