Tirupati: సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు: వేమూరి ఆదిత్య
ABN , Publish Date - May 22 , 2025 | 01:25 PM
Arani Srinivasulu: వార్త పత్రికల్లో సమస్యలు ప్రచురించడమే మాత్రమే కాదు.. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య తెలిపారు. ఇది మొదటి అడుగు అని.. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
తిరుపతి, మే 22: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో జీవకోనలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గురువారం తిరుపతిలో అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన కార్యక్రమంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని గతంలో ప్రజలు కోరారన్నారు. మా సొంత నిధులతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వంద రోజులు క్రితం నిర్వహించిన సభలో ప్రజలు అడిగిన అన్ని సమస్యల పరిష్కారానికి తాము చర్యలు తీసుకున్నామని వివరించారు. రూ 1.47కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేశారు. ఇక ఇంటి పట్టాల విషయంలో రెవెన్యూ అధికారులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

ఈ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య మాట్లాడుతూ.. సమస్యలు ప్రచురించడం మాత్రమే కాదు.. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఇది మొదటి అడుగు అని.. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రూ. 60 లక్షల పనులు పూర్తి చేశామని వివరించారు. ఇంకా రూ. 87.30 లక్షల పనులకు అనుమతులు వచ్చాయని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా సహకరించిన అధికారులతోపాటు ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ కార్యక్రమం చేపట్టిన అనంతరం జీవకోనపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని దీని ద్వారా స్పష్టమైందన్నారు. నీటి, వీధి దీపాలు, వీధి కుక్కలు, స్మశాన పనులు ఇలా ప్రతి చిన్న, పెద్ద సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ విజయోత్సవ సభలో ప్రజలు మాట్లాడుతూ.. గంజాయి సమస్య కారణంగా.. అవుట్ పోస్టు కావాలని కోరామని.. దీంతో ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారని జీవకోన ప్రజలు తెలిపారు. అలాగే శ్మశానానికి ప్రహరీ గోడ సైతం నిర్మించారని గుర్తు చేశారు. గత ఎన్నో ఏళ్లుగా రహదారులు, కాలువలు సమస్యలపై ఎంతో మంది దృష్టికి తీసుకు వెళ్లామని.. కానీ వారి వల్ల సాధ్యం కాని పనులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా పరిష్కారమయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు జీవకోన ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు
టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. వైసీపీ నేతపై కేసు నమోదు
For AndhraPradesh News And Telugu News