Share News

Bird flu: కోళ్ల లెక్కలు తేల్చిన ప్రభుత్వం.. బర్డ్ ఫ్లూపై కీలక ప్రకటన

ABN , Publish Date - Feb 12 , 2025 | 08:31 PM

Bird flu: బర్డ్ ప్లూ వల్ల దాదాపు 5 లక్షల కోళ్లు మరణించినట్లు సమాచారం ఉందని ఏపీ పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల మంత్రి కె. అచ్చెన్నాయుడు వివరించారు. కానీ 40 లక్షల కోళ్లు మరణించినట్లు ప్రచారం జరుగుతోందన్నారు.

Bird flu: కోళ్ల లెక్కలు తేల్చిన ప్రభుత్వం.. బర్డ్ ఫ్లూపై కీలక ప్రకటన
AP Minister K Atchannaidu

అమరావతి, ఫిబ్రవరి 12: బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు. చనిపోయిన కోళ్లను.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా.. అవి బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్లు నివేదికలో స్పష్టమైందని చెప్పారు. ఈ వ్యాధి వల్ల ఏలూరు జిల్లా బాదంపూడిలో 2 లక్షల కోళ్లు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7 వేల కోళ్లు చనిపోయినట్టు సమాచారం ఉందన్నారు.

బుధవారం అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. పౌల్ట్రీలలో ఉన్న గుడ్లను కూడా పూడ్చి వేయించామని చెప్పారు. ఈ బర్డ్ ప్లూ కారణంగా దాదాపు 5 లక్షల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందని.. కానీ 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం అయితే జరుగుతోందన్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు.

ఈ బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలోని షాపులను మూసి వేశామన్నారు. ఇక బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా ఈ వ్యాధి తగ్గుతుందన్నారు. పౌల్ట్రీలలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


మరోవైపు తెలంగాణలో సైతం లక్షలాది కోళ్లు ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నాయి. ఇక మార్కెట్‌లో చికెన్ ధరలు సైతం అమాంతంగా పడిపోయాయి. కేజీ చికెన్ ధర రూ. 150గా ఉంది. అయినా చికెన్ కొనుగోలు చేసేందుకు వినియోగ దారులు భయాంందోళనలకు గురవుతోన్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 08:46 PM