Tata Renewable Energy: రాష్ట్రంలో ‘టాటా ఎనర్జీ’ భారీ పెట్టుబడులు
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:32 AM
వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె.విజయానంద్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ, ఎండీ దీపేశ్ నందా, ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండీ కమలాకరబాబు శుక్రవారం ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు.
49 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి
ఎన్ఆర్ఈడీసీఏపీతో ఒప్పందం
పునరుత్పాదక రంగంలో 10 లక్షల కోట్ల
పెట్టుబడులే లక్ష్యం: మంత్రి లోకేశ్
7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: సీఈఓ
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.49,000 కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఎన్ఆర్ఈడీసీఏపీ)తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థకు భూములు, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం సహకారం అందిస్తుంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె.విజయానంద్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ, ఎండీ దీపేశ్ నందా, ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండీ కమలాకరబాబు శుక్రవారం ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా టాటాతో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల పునరుద్పాదక శక్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు కావాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీరంగంలో 7.5లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు.

ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర పునరుద్పాదక విద్యుత్తు ఉత్పత్తి సామర్థాన్ని గణనీయంగా పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో గ్రీన్ఎనర్జీ లక్ష్యాలను అధిగమించేందుకు ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయాలని ఎన్ఆర్ఈడీసీఏపీని లోకేశ్ ఆదేశించారు.
రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం సంతోషం: టాటా
పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో దీపేశ్ నందా చెప్పారు. పునరుత్పాదక విద్యుత్తు రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఏడు గిగావాట్ల వరకూ స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్రం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ఏఐతో పాలన మెరుగుపరుస్తాం: లోకేశ్
ఏఐ వినియోగం ద్వారా పౌర సేవలు, పాలనా సామర్థ్యాలను మెరుగుపరచుకుంటామని మంత్రి లోకేశ్ చెప్పారు. పాలనలో సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి సమక్షంలో సాంకేతిక సహకారంపై వాద్వానీ ఫౌండేషన్ తరఫున వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈవో ప్రకాశ్కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని లోకేశ్ అన్నారు. ఏఐ ఆధారిత పాలసీ ఫ్రేమ్వర్క్ను నిర్మించడానికి, సేవలు అందించడాన్ని మెరుగుపరచడానికి, అధునాతన డిజిటల్ నైపుణ్యాలతో కూడిన శ్రామికశక్తిని తయారు చేయడానికి వాద్వానీ ఫౌండేషన్ సహకరిస్తుందని వెల్లడించారు. ఏఐతో పాలనలో పరివర్తన తీసుకురావడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వాద్వానీ ఫౌండేషన్ అధికారి ప్రకాశ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంచడం ద్వారా వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. డిజిటల్ లెర్నింగ్లో భాగంగా అత్యాఽధునిక ఏఐ కోర్సులు అందిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..