Share News

Chandrababu: పొగాకు రైతులను ఆదుకోండి

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:45 AM

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సీఎం చంద్రబాబు కోరారు.

Chandrababu: పొగాకు రైతులను ఆదుకోండి

  • బర్లీ పొగాకు కోసం 150 కోట్లు వెచ్చించండి

  • 300 కోట్లతో మేం పొగాకు కొంటున్నాం

  • పామాయిల్‌ సుంకంలో పాత విధానమే మేలు

  • ఆక్వా టారీఫ్‌ల భారంపై అమెరికాతో చర్చించాలి

  • మామిడి గుజ్జుపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించాలి

  • కేంద్ర మంత్రి గోయల్‌ను కోరిన చంద్రబాబు

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి గోయల్‌ ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా రైతుల కష్టాలపై చర్చించారు. హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, క్రూడ్‌ పామాయిల్‌పై దిగుమతి సుంకం విధింపు, మామిడి గుజ్జుపై జీఎస్టీ వంటి అంశాలను ప్రస్తావించారు. రైతుల ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు కేంద్ర సహకారాన్ని కోరారు. ప్రస్తుత సీజన్‌లో హెచ్‌డీ బర్లీ, వైట్‌ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు ధరలు తగ్గిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సీఎం వివరించారు. పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని, దీనిలో భాగంగా రూ.300 కోట్లతో 2 కోట్ల కిలోల పొగాకును కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 కొనుగోలు కేంద్రాలను ఏపీ మార్క్‌ఫెడ్‌ ఏర్పాటు చేసిందన్నారు. పొగాకు కొనుగోళ్ల కోసం రూ.150 కోట్లు భారత పొగాకు బోర్డు వెచ్చించేలా చూడాలని సీఎం కోరారు. ప్రస్తుతం ఏపీలో 1.31 లక్షల హెక్టార్లలో పొగాకు సాగు చేశారని, గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకుకు డిమాండ్‌ తగ్గడంతో ధరల విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి, మార్కెట్‌ను పొగాకు బోర్డు పరిధిలోకి తెచ్చేలా చట్టాన్ని సవరించాలని సీఎం సూచించారు.


సుంకం తగ్గిస్తే సమస్యలు

క్రూడ్‌ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 10శాతానికి తగ్గించడం వల్ల ఆయిల్‌పామ్‌ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. క్రూడ్‌ పామాయిల్‌పై దిగుమతి సుంకం విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని కోరారు. సుంకం తగ్గింపుతో కేంద్రం నిర్దేశించిన ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌’ లక్ష్యాలను చేరుకోలేమన్న విషయాన్ని గమనించాలని సూచించారు. అలాగే ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల వల్ల ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధించిన 27శాతం సుంకాన్ని తగ్గించేలా ఆ దేశ అధికారులతో మాట్లాడాలని కోరారు. ఆక్వా రైతులపై ఈ టారీఫ్‌ భారం తగ్గించి, సంక్షోభం నుంచి బయటపడేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా విధించిన సుంకాల వల్ల ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్‌ మిల్లులు, ప్రొసెసింగ్‌ యూనిట్లు, ఎగుమతిదారులు సంక్షోభంలో పడ్డారని సీఎం వివరించారు. అలాగే మామిడి గుజ్జుపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని సీఎం కోరారు. మామిడి తాండ్రపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, అదే విధానం గుజ్జుకు కూడా వర్తింపజేయాలన్నారు. జీఎస్టీ తగ్గిస్తే మామిడి రైతులకు, గుజ్జు పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు వివరించారు. చంద్రబాబు విజ్ఞప్తిపై గోయల్‌ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని పొగాకు, ఆయిల్‌పామ్‌, మామిడి, ఆక్వా రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. భేటీ అనంతరం కేంద్రమంత్రిని సీఎం శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.

Updated Date - Jun 16 , 2025 | 03:48 AM