SECI Agreement: క్లీన్‘చీట్’!
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:41 AM
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఉత్తర్వులు, వ్యాఖ్యలకే వక్ర భాష్యాలు చెప్పింది. ‘సెకీ ఒప్పందం సక్రమమే’ అని ఈఆర్సీ చెప్పిందంటూ కల్పిత కథనాన్ని వండి వార్చింది.

సెకీ ఒప్పందంపై జగన్ రోత పత్రిక యవ్వారం
అంతా సక్రమమే అని ఈఆర్సీ పేరిట అబద్ధాలు
చౌకధర, రాష్ట్రానికి ఆదా అంటూ మాయ మాటలు
ప్రసార చార్జీలు వర్తించవని చెప్పినట్లు కల్పితాలు
ఈఆర్సీ ఉత్తర్వులకు వక్రభాష్యంతో కథనం
‘సక్రమం’ అని ఎక్కడా చెప్పని నియంత్రణ కమిషన్
హైకోర్టు పరిధిలో ఉందని.. తాము సొంతంగా
రద్దు చేయలేమని మాత్రం వెల్లడి
అందుకే... ఏఆర్ఆర్లో కొనుగోలు ప్రస్తావన
జగన్ రోత పత్రిక మరోసారి తన నైజాన్ని చాటుకుంది! ‘సెకీ’తో కుదుర్చుకున్న అడ్డగోలు ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు అబద్ధపు రాతలు రాసేసింది! ఏకంగా... ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఉత్తర్వులు, వ్యాఖ్యలకే వక్ర భాష్యాలు చెప్పింది. ‘సెకీ ఒప్పందం సక్రమమే’ అని ఈఆర్సీ చెప్పిందంటూ కల్పిత కథనాన్ని వండి వార్చింది. పనిలోపనిగా ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా అక్కసు వెళ్లగక్కింది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా సాగిన జగన్ రోతపత్రిక అచ్చోసిన అబద్ధాలు, అసలు వాస్తవాలు ఇవీ..
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
జగన్ సర్కారు 2021లో సెకీతో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. పేరుకే ‘సెకీ’! అసలు సరఫరాదారు మాత్రం అదానీ! ఈ ఒప్పందం రాష్ట్రానికి పెనుభారంగా పరిణమిస్తుందని... పాతికేళ్లపాటు జనానికి షాకులు తప్పవని నిపుణులు హెచ్చరించారు. అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల (ఐఎ్సటీఎస్) రూపంలో చాలా భారం పడుతుందని తెలిపారు. భవిష్యత్తులో సౌర విద్యుత్తు ధర మరింత తగ్గే అవకాశమున్నా... ముందుచూపులేకుండా దీర్ఘకాలిక ఒప్పందం చేసుకోవడం సరికాదన్నారు. ఈ అభ్యంతరాలేవీ నాటి జగన్ సర్కారు పట్టించుకోలేదు. ఇతర చార్జీలు ఉండవని, ట్రాన్స్మిషన్ చార్జీలపై పూర్తి మినహాయింపు ఉంటుందని సెకీతో డిస్కమ్లు ఒప్పందం చేసుకునే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఇంధన శాఖ పేర్కొంది. అవన్నీ అవాస్తవాలని తర్వాత వెల్లడైంది.
సెకీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం వెనుక భారీగా అవినీతి జరిగిందని, కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టులోనూ, కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి (సీఈఆర్సీ)లోనూ పిటిషన్లు వేశారు. టీడీపీ నేత, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. అలాగే... సెకీతో ఒప్పందాల కోసం ‘అదానీ’ సంస్థ ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు లంచాలు ఇచ్చిందంటూ ఏకంగా అమెరికా దర్యాప్తు సంస్థ, న్యాయ విభాగం బయటపెట్టాయి. దీంతో ఇది అంతర్జాతీయ స్థాయి వివాదంగా మారింది.
మసిపూసి... మాయ చేసి!
అసలు విషయం, వివాదం అలాగే ఉన్నప్పటికీ... జగన్ రోత పత్రిక మాత్రం ‘సెకీ ఒప్పందానికి ఈఆర్సీ క్లీన్చిట్ ఇచ్చేసింది’ అంటూ శనివారం ఒక అబద్ధాల కథనం ప్రచురించింది. ‘ఈఆర్సీ చెప్పింది’ అంటూ తనకు ఇష్టమొచ్చినట్లు, తనకు తోచినట్లుగా రాసేసుకుంది. జగన్ పత్రిక చెప్పినట్లుగా... ‘సెకీ ఒప్పందం సక్రమమే, అందులో ఎలాంటి లోపాలు లేవు, అందువల్ల రద్దు చేయడం కుదరదు’ అని ఏపీఈఆర్సీ ఎక్కడా చెప్పలేదు. ఈ ఒప్పందానికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీనిపై హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనందున తాను సొంతంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేనని స్పష్టం చేసింది.
జగన్ పత్రిక అబద్ధాలు
సెకీ ఒప్పందం సక్రమమేనని విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పింది. ఎలాంటి లోపాలు లేవని, అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని, కాబట్టి రద్దు చేయడం కుదరదని పేర్కొంది.
జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరిగింది.
రాష్ట్ర చరిత్రలోనే కారుచౌక ఒప్పందం. ఖజానాకు రూ.1.10 లక్షల కోట్ల ఆదా.
ఇవీ వాస్తవాలు
సెకీతో ఒప్పందానికి ఈఆర్సీ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా ‘రోత పత్రిక’ ఒక చిత్రాన్ని ప్రచురించింది. అందులో అక్షరం అక్షరం చదివినా... ఎక్కడా ‘క్లీన్ చిట్’ ఇచ్చినట్లు కనిపించదు. ఒప్పందం నేపథ్యం, అభ్యంతరాలను వివరిస్తూ... కోర్టు పరిధిలో ఉన్నందున తనంతట తానుగా ఒప్పందం రద్దు చేయలేనని మాత్రమే తెలిపింది.
2021లో సెకీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్కు రూ.2.49 చెల్లించాలి. అప్పటికే గుజరాత్ సెకీతో యూనిట్కు రూ.1.90కే ఒప్పందం చేసుకుంది. అంటే... గుజరాత్ కంటే 59 పైసలు ఎక్కువ ధరకు. మరి... ఇది చౌక విద్యుత్తు ఎలా అవుతుంది?
ప్రజలపై భారం పడేలా మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు ఒప్పందం. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.1.25 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణుల అంచనా!
రోత పత్రిక
‘‘సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎ్సఏపై ఏపీఈఆర్సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది’’ అని ఈఆర్సీ పేర్కొన్నట్లు రాశారు.
వాస్తవం:
సెకీ ఒప్పందంపై అభ్యంతరాలు రావడం, దానిని రద్దు చేయాలని కోరడం నిజమే. సెకీ ఒప్పందంపై ఇప్పటికీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఒప్పందం అమలవుతుందని ఈఆర్సీ తేల్చి చెప్పింది. అదే సమయంలో... లంచాలు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఒప్పందాన్ని తమంతట తాము రద్దు చేయలేమని తెలిపింది. దీనికి కారణం... ఈ వివాదం కోర్టు పరిధిలో ఉండటమే. అయినా సరే... ‘హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది’ అన్నట్లుగా రోత పత్రిక రాసేసింది. ఏపీఈఆర్సీ పరిశీలించిన తీర్పులేమిటో వారికే తెలియాలి.
రోత పత్రిక
‘కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, సెంట్రల్ రెగ్యులేషన్ కమిషన్, పనరల్ నెట్వర్క్ యాక్సెస్ నిబంధనలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం... సెకీ విద్యుత్తుకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు (ఐఎ్సటీఎస్) వర్తించవు’ అని ఈఆర్సీ పేర్కొన్నట్లు రోత పత్రిక వెల్లడించింది..
వాస్తవం:
ఇదో పెద్ద, శుద్ధ అబద్ధం. సెకీ విద్యుత్తుకు ఐఎ్సటీఎస్ నుంచి మినహాయింపు ఉందని ఈఆర్సీ ఎక్కడా చెప్పలేదు. దీనిపై గత ఆగస్టు 13న ఒక స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎ్సటీఎస్ చార్జీల మినహాయుంపు పొందాల్సిన బాధ్యత సెకీదే అని తెలిపింది. అలా చేయలేకపోతే... జనరల్ నెట్వర్క్ యాక్సిస్ (జీఎన్ఏ) రెగ్యులేషన్స్లోని 20.4 క్లాజ్ ప్రకారం స్టేట్ ట్రాన్స్మిషన్ యూనిట్ (ఎస్టీయూ)నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకుని ‘జనరల్ నెట్వర్క్ యాక్సె్స’కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఆర్ఏపీఎ్ససీఓఎం (గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా సంస్థ) కు సూచించింది. అంతే తప్ప... సెకీ ఒప్పందానికి ఐఎ్సటీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఉందని ఈఆర్సీ ఎక్కడా చెప్పలేదు. ‘కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ జీఎన్ఏ నిబంధనలు, సెకీ ఒప్పందంలోని అంశాల మేరకే ఐఎ్సటీఎస్ చార్జీల నుంచి మినహాయింపు ఉండాలి’ అని ఈఆర్సీ అభిప్రాయపడినట్లు రోత పత్రిక ప్రచురించిన ఉత్తర్వుల భాగంలోనే ఉంది. (జీఎన్ఏ నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు)
రోత పత్రిక
సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కమ్లు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ ఏడాది 4వేల మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళికలో చేర్చకపోవడానికి ఎటువంటి కారణం కనిపించడంలేదు.
వాస్తవం:
సాంకేతికంగా చూస్తే సెకీతో ఒప్పందం అమలులో ఉన్నట్లే. దీనిని ఆపివేస్తూ ఎలాంటి ఉత్తర్వులూ, తీర్పులూ లేవు. అమలులో ఉన్న ఇతర ఒప్పందాల ప్రకారం విద్యుత్ సమీకరణకు అవకాశం కల్పించినట్లే ‘సెకీ’ ఒప్పందాన్నీ ఏఆర్ఆర్లో చేర్చారు. ఇది... సెకీ డీల్కు క్లీన్ ఇచ్చినట్లు కాదు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.