Tirumala Accident: తిరుమల ఘాట్లో బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:45 AM
శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన ఓ భక్తురాలు తిరుమల ఘాట్రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.
మహిళ మృతి.. ఆమె భర్త, కుమారుడికి స్వల్ప గాయాలు
తిరుమల, జూన్ 30(ఆంధ్రజ్యోతి): శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన ఓ భక్తురాలు తిరుమల ఘాట్రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన సయ్యద్ రబ్బానీ, సయ్యద్ ఆరీఫా దంపతులు తమ కుమారుడు షమీర్తో కలిసి శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చారు. ఆదివారం రాత్రి దర్శనం చేసుకుని సోమవారం ఉదయం బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. ఘాట్రోడ్డులోని 24వ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ముందు భాగం తగలడంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కగా పడిపోయింది. ఈ క్రమంలో ఆరీఫా(41) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రబ్బానీ, షమీర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.