Dalit Welfare: మళ్లీ సబ్ప్లాన్
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:07 AM
గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను మళ్లీ సమర్థంగా అమలు చేసేందుకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది.
చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ నిధుల వినియోగం
దళిత, గిరిజన కాలనీల్లో మౌలిక వసతులు
సిమెంట్ రోడ్లు, డ్రెయున్ల నిర్మాణం
అన్ని శాఖల నుంచీ సబ్ప్లాన్ అమలుకు నోడల్ ఏజెన్సీ సన్నాహకాలు
గత వైసీపీ హయాంలో సబ్ప్లాన్ నిర్వీర్యం
డీబీటీ పథకాలతో బుక్ అడ్జెస్ట్మెంట్
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను మళ్లీ సమర్థంగా అమలు చేసేందుకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. గత ఐదేళ్లూ సబ్ప్లాన్ నిధుల వినియోగం పుస్తకాలకే పరిమితమైంది. వైసీపీ సర్కారు అమలు చేసిన డీబీటీ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు అందిన ప్రయోజనాలనూ లెక్కించి సబ్ప్లాన్ అమలు చేసినట్లు బుక్ అడ్జెస్ట్మెంట్ చేసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా కూడా వెచ్చించకపోవడంతో దళిత, గిరిజన కాలనీల్లో ఎక్కడా మౌలిక వసతులకు నోచుకోలేదు. గత టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వేసిన రోడ్లు, డ్రెయిన్లు తప్ప గత ఐదేళ్లలో ఎక్కడా పనులు జరగలేదు. చట్ట ప్రకారం అమలు చేయాల్సిన సబ్ప్లాన్ నిధులు ఖర్చు చేయలేదు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత కూడా మొదటి ఏడాది సబ్ప్లాన్ అమలు నామమాత్రంగానే జరిగింది. ఇక సబ్ప్లాన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి నోడల్ ఏజెన్సీ సమావేశం ద్వారా అన్ని శాఖల నుంచి సబ్ప్లాన్ అమలును సమీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వంలో సబ్ప్లాన్కు సంబంధించి గ్రామాల్లో సిమెంట్ రోడ్లకు ప్రణాళికలు వేసి మరీ అభివృద్ధి చేసింది. 40 శాతం జనాభా ఉన్న ప్రతి దళిత, గిరిజన కాలనీల్లో సబ్ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు నిర్మించింది. మౌలిక వసతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు, వారికి పలు సౌకర్యాలను కల్పించేందుకు నిధులు వాడింది. 2014-15 నుంచి 2018-19 వరకు ఐదేళ్లలో మొత్తం రూ.7,08,623 కోట్ల బడ్జెట్కు గాను ఎస్సీలకు రూ.33,625 కోట్లు అంటే.. 4.75 శాతం ఖర్చు చేసింది. ఎస్టీ సబ్ప్లాన్కు సంబంధించి రూ.12,530 కోట్లు ఖర్చు చేసింది. వైసీపీ హయాంలో 2019-20 నుంచి 2024-25 మధ్యకాలంలో రూ.12,19,078 కోట్ల బడ్జెట్కు గాను ఎస్సీ సబ్ప్లాన్ కింద రూ.46,323 కోట్లు అంటే.. 3.80 శాతమే ఖర్చు చేశారు. ఎస్టీ సబ్ప్లాన్లో రూ.15,636 కోట్లు అంటే.. 1.28 శాతమే ఖర్చు చేసినట్లు చూపించారు.