Share News

Andhra Pradesh Liquor Scam: జగన్‌ చెప్పారు.. నేను చేశాను!

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:09 AM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్టయ్యారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయి.

Andhra Pradesh Liquor Scam: జగన్‌ చెప్పారు.. నేను చేశాను!

ముడుపుల డబ్బులు జగన్‌ ఓఎస్డీకే ఇచ్చాం

లిక్కర్‌ స్కామ్‌ సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి అంగీకారం!

ఏ4 ఎంపీ మిథున్‌రెడ్డి

ఏ1 రాజ్‌ కసిరెడ్డి

ఏ5 సాయిరెడ్డి

పార్టీ ఫండ్‌ బాగా వచ్చేలా ‘మద్యం పాలసీ’ రూపొందించాలని జగన్‌ సూచించారు

విజయసాయి నివాసంలోనే ‘ముడుపుల స్కీమ్‌’

మిథున్‌, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, సత్యప్రసాద్‌తో భేటీ

మరో భేటీలో వాసుదేవరెడ్డితో కలిసి కమీషన్లు ఫిక్స్‌

ఉత్పత్తి-సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్‌లోనే!

సీ-టెల్‌ సాఫ్ట్‌వేర్‌తో మా పథకం పారదు

అందుకే దానిని తీసేసి.. మాన్యువల్‌గా ‘సరఫరా’

ముడుపులిచ్చే కంపెనీలకే ఆర్డర్లు.. లేదంటే లేదు

ప్రతినెలా ఐదో తేదీన ‘కమీషన్ల’ లెక్కలు

దోపిడీ 3,200 కోట్లు.. రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడి

కసిరెడ్డికి రిమాండ్‌.. విజయవాడ జైలుకు తరలింపు

అమరావతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ ఆదేశించారు. నేను ఆచరించాను. మిథున్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించాం. జగన్‌ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డితోపాటు పలువురికి ఇందులో పాత్ర ఉంది’’ అని లిక్కర్‌ స్కామ్‌ సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి అలియాస్‌ కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అంగీకరించినట్లు ‘సిట్‌’ వెల్లడించింది. రాజ్‌ కసిరెడ్డి రిమాండ్‌ రిపోర్టులో అనేక కీలక విషయాలు బయటపెట్టింది. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయనను ప్రశ్నించామని... నేరం, దాని వెనుక ఉన్న కుట్ర, తన పాత్ర, ఇతరుల భాగ స్వామ్యంపై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్‌ కసిరెడ్డి, చివరికి నేరాంగీకరపత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారని ‘సిట్‌’ పేర్కొంది. రిమాండ్‌ రిపోర్టులో ఏముందంటే...

gbhy.jpg

జగన్‌ చెబితేనే చేశా...

ప్రభుత్వానికి, పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కవుట్‌ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్‌ నాకు అప్పగించారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్‌ రావాలని, పథకాల అమలుకూ ఆదాయం సమకూరాలని నిర్దేశించారు. దీంతో... బేవరేజెస్‌ కార్పొరేషనే లిక్కర్‌ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించాం. ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి... తొలుత బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా, ఆ తర్వాత బేవరేజెస్‌, డిస్టిలరీస్‌ కమిషనర్‌గా నియమించారు. మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, లేబుల్‌ రిజిస్ట్రేషన్‌లు తదితర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ ఆయనకే దక్కేలా చూశారు. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా ప్లాన్‌ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్‌కు అప్పగించాం. 2023లో ఆయనకు సివిల్‌ సర్వీసు కోటాలో ఐఏఎస్‌ హోదా ఇప్పిస్తామని మాట ఇచ్చాం. మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించాం.


విజయసాయి ఇంట్లోనే...

మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్‌లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్‌ చేశాం. 2019 అక్టోబరు 13న విజయసాయి ఇంట్లోనే కీలక భేటీ జరిగింది. విజయ సాయిరెడ్డి, పి.మిథున్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్‌ భేటీ అయ్యాం. మద్యం ఉత్పత్తి దారులు, డిస్టిలరీస్‌ నుంచి నెలకు కనీసం 50-60 కోట్లు ముడుపులు వచ్చేలా స్కీమ్‌ రూపొందించాం. ఇందుకోసం తొలుత అబ్కారీ శాఖలో కీలకమైన సీ-టెల్‌ సాఫ్ట్‌వేర్‌ను తొలగించాలనుకున్నాం. ఇదే విషయాన్ని సత్యప్రసాద్‌కు చెప్పాం. సీ-టెల్‌ సాఫ్ట్‌వేర్‌లో మద్యం అమ్మకాలు, సరఫరా వివరాలన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. ఆయా బ్రాండ్ల మూడు నెలల అమ్మకాలు, దానిపై పది శాతం పెరుగుదలను కలిపి స్టాక్‌ ఇచ్చేలా ఆ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇది అమల్లో ఉంటే మా పథకం ఫలించదు. మా ప్లాన్‌ ప్రకారం మద్యం సరఫరాను కంప్యూటర్‌లు, ఆన్‌లైన్‌ డిసైడ్‌ చేయకూడదు. ఏ బ్రాండ్‌ను ఎంత మేరకు సరఫరా చేయాలో, రిటైల్‌ షాపులో ఏవి విక్రయించాలో మేమే నిర్ణయించాలి. అందువల్ల... సరఫరాను ఆన్‌ లైన్‌కు బదులు ఆఫ్‌లైన్‌లో సాగేలా నిర్ణయించాం. మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలను పూర్తిగా మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం.

ముడుపుల ఖరారు భేటీ...

2019 డిసెంబరులో హైదరాబాద్‌లో శరత్‌చంద్రారెడ్డి ఆస్పత్రి వీధిలోని ఓ ప్రైవేటు బంగ్లాలో నేను, మిథున్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, బేవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డి సమావేశమయ్యాం. మద్యం సీసా బేసిక్‌ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారులనుంచి ముడుపులు వచ్చేలా ఫిక్స్‌ చేశాం. మేం నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతి నెలా కనీసం రూ.50-60 కోట్లు వచ్చేవి. మద్యం బ్రాండ్ల సరఫరా, ప్రభుత్వ షాపుల్లో లిక్కర్‌ అమ్మకాలపై ప్రతినెలా మాకు డేటా వచ్చేది. ఇందుకోసం అనూష, సైఫ్‌ అనే ఉద్యోగులను ఉపయోగించుకున్నాం. ప్రతినెలా ఐదో తేదీన కమీషన్ల లెక్కలు వేసేవాళ్లం. వీరిచ్చే డేటాను బట్టి టి. కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బోనేటి చాణక్య అలియాస్‌ ప్రకాశ్‌ ఆయా కంపెనీలకు ఫోన్లు చేసేవాళ్లు. ఫోన్‌కాల్స్‌ కోసం వీపీఎన్‌ ఉపయోగించేవారు. కంపెనీలు ముడుపుల సొమ్ము ఇచ్చాక... అవి నా దగ్గరకు చేరేవి. నేను ఆ డబ్బును తిరిగి ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, బాలాజీకి పంపించే వాడిని.


ఏ4 ఎంపీ మిథున్‌రెడ్డి

లిక్కర్‌ స్కామ్‌లో నిందితులు 29 మంది

ఏ1 రాజ్‌ కసిరెడ్డి, ఏ 5 విజయసాయి

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో మొత్తం 29 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు ఉన్నాయి. ఏ1గా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి(రాజ్‌ కసిరెడ్డి), ఏ2 బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఏ3 ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డి.సత్యప్రసాద్‌, ఏ4 ఎంపీ మిథున్‌రెడ్డి, ఏ5 మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్‌రెడ్డి (నంద్యాల), ఏ7 ముప్పిడి అవినాశ్‌రెడ్డి (హైదరాబాద్‌), ఏ8 బూనేటి చాణక్య (హైదరాబాద్‌), ఏ9 టి.ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి (తిరుపతి), ఏ10 ఎస్‌కె.సైఫ్‌ అహ్మద్‌ (శ్రీకాళహస్తి), ఏ11 ఆల్విక్‌ మల్టీ వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏ12 కృపాటి ఎంటర్‌ప్రైజెస్‌, ఏ13 నైస్నా మల్టీ వెంచర్‌, ఏ14 ట్రిఫర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఏ15 విక్సో ఎంటర్‌ప్రైజెస్‌, ఏ16 డి-కార్ట్‌ లాజిస్టిక్స్‌, ఏ17 టెక్కర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌, ఏ18 దీపక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఏ19 విశాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఏ20 లావిశ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఏ21 కీరాజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఏ22 అర్రోయో సర్వీసెస్‌, ఏ23 ఎజీలోడ్‌ నెట్‌వర్క్‌, ఏ24 బాలాజీ ట్రేడింగ్‌, ఏ25 అదాన్‌ డిస్టిలరీ, ఏ26 లీలా డిస్టిలరీ, ఏ27 న్యూ మోంట్‌ గోల్డ్‌ అండ్‌ జ్యూవెలరీ, ఏ28 రుచిత జ్యూవెలర్స్‌, ఏ29 మలిష్క గోల్డ్‌ అండ్‌ జ్యూవెలరీ ఉన్నాయి.


Also Read:

పాపం.. చచ్చిపోతాడని తెలీదు..

కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..

చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 07:23 AM