Teachers unions: ఉపాధ్యాయుల పోరుబాట
ABN , Publish Date - May 17 , 2025 | 04:18 AM
ఉపాధ్యాయ సంఘాలు జీవో 21లో ఉన్న అసంబద్ధ నిర్ణయాలను ఖండించి, ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖపై నిరసనలు చేపట్టనున్నారు. వారు ప్రధానమంత్రి సమక్షంలో మాత్రమే చర్చలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
విద్యా సంస్కరణలు అసంబద్ధమని ధ్వజం
గత ప్రభుత్వంలో 6.. ఇప్పుడు 9రకాల బడులా?
తెలుగు మీడియం లేకుండా చేయడం దారుణం
అధికారులతో సమావేశం బహిష్కరణ
21, 23 తేదీల్లో కార్యాలయాల ముట్టడి
విద్యామంత్రితో మాత్రమే చర్చలకు డిమాండ్
అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): జీవో 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన జీవో 21లోనూ అసంబద్ధ నిర్ణయాలున్నాయని, వాటిని తాము వ్యతిరేకించినా పాఠశాల విద్యాశాఖ ఏకపక్షంగా వాటిపై నిర్ణయం తీసుకుందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. ఇటీవల హేతుబద్ధీకరణ జీవోలు జారీచేసిన నేపథ్యంలో శుక్రవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్వహించదలచిన సమావేశాన్ని గుర్తింపు పొందిన సంఘాలు మూకుమ్మడిగా బహిష్కరించాయి. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్-257, ఏపీటీఎఫ్-1938, పీఆర్టీయూ, ఏపీయూఎస్, ఆప్టా, వైఎ్సఆర్టీఏ, పీహెచ్ఎంఏ సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి. నూతన సంస్కరణలకు నిరసనగా ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈవోల కార్యాలయాల ముట్టడి, 23న పాఠశాల విద్య డైరెక్టర్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆ తర్వాత మిగిలిన ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని వెళ్తూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపాయి. ఇకపై చర్చలంటూ నిర్వహిస్తే కేవలం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సమక్షంలోనే జరగాలని స్పష్టంచేశాయి. ఇక నుంచి ప్రతి శుక్రవారం జరిగే చర్చలకు హాజరుకాబోమని ఆ సంఘాల నాయకులు స్పష్టంచేశారు. గత 30 వారాలుగా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నా, తాము లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలను విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వల్ల మూడు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారని, ఈ ప్రభుత్వం కూడా అవే విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఆరు రకాల బడుల విధానం అమలుచేస్తే, ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల బడుల విధానం ప్రవేశపెట్టడం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమేనన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకుండా చేయడం దారుణమన్నారు.
ఇవీ డిమాండ్లు
ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఏర్పాటుచేయాలి. మోడల్ ప్రైమరీ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించకూడదు. ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి వారినే హెచ్ఎంలుగా నియమించాలి. ఇంగ్లీష్, తెలుగు మీడియంలను, మైనర్ మీడియంలను కొనసాగించాలి. ఆ మేరకు పోస్టులు కేటాయించాలి. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 40 మంది విద్యార్థులు దాటితే మూడో టీచర్ పోస్టు ఇవ్వాలి. ఒక్క పోస్టు కూడా బ్లాక్ చేయకుండా బదిలీలు చేపడతామని గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పోస్టులు బ్లాక్ చేస్తున్నారు. పోస్టులు బ్లాక్ చేయకుండా బదిలీలు చేపట్టాలి. ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు, విద్చార్థుల నిష్పత్తి 1:20 అమలుచేయాలి. రెండు సార్లు రేషనలైజేషన్కు గురైన టీచర్లకు బదిలీల్లో అన్ని స్టేషన్ల పాయింట్లు ఇవ్వాలి. రేషనలైజేషన్లో సీనియర్ బదిలీకి విల్లింగ్ ఇస్తే పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వాలి. రేషనలైజేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరం చేపట్టకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News