Pawan Emotional Moment: హత్తుకున్న అభిమానం
ABN , Publish Date - May 10 , 2025 | 04:44 AM
పవన్ కళ్యాణ్ గెలుపుకోసం మొక్కు తీర్చిన 96 ఏళ్ల పోతుల పేరంటాలకు పవన్ స్వయంగా పాదాభివందనం చేసి, ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆమెకు చీర, రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేసి, అమ్మవారి గుడి పునరుద్ధరణకు హామీ ఇచ్చారు

96 ఏళ్ల అవ్వకు పవన్ పాదాభివందనం
స్వయంగా వడ్డించి ఆమెతో కలిసి భోజనం
చీర పెట్టి రూ.లక్ష బహూకరణ
అమరావతి, కొత్తపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): గత సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం వేగులమ్మ అమ్మవారికి మొక్కుకుని, తన పింఛను సొమ్ముతో ఆ మొక్కు చెల్లించిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాదాభివందనం చేశారు. ఆమెను గుండెలకు హత్తుకుని.. స్వయంగా భోజనం వడ్డించారు. చీర బహూకరించి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. డిప్యూటీ సీఎం తనపై చూపిన ప్రేమకు ఆ వృద్ధురాలు ఆనందంతో పొంగిపోయింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పోతుల పేరంటాలు.. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించాలని కోరుకూ గ్రామ దేవత వేగులమ్మకు మొక్కుకుంది.
దీనికోసం నెలనెలా తనకు వచ్చే పింఛను సొమ్ములో కొంత దాచి రూ.27 వేలతో అమ్మవారికి గరగ చేయించి మొక్కు చెల్లించుకుంది. దీనిపై ‘పవన్ గెలుపుతో మొక్కు తీర్చుకున్న 96 ఏళ్ల అవ్వ’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 6న ప్రచురితమైన కథనం పవన్ను ఆకర్షించింది. ఒంటరి జీవితం గడుపుతూ సొంత ఇల్లు కూడా లేని ఆ అవ్వ గురించి తెలుసుకుని.. ఆమెను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి తీసుకురావాలని అనుచరులను ఆదేశించారు. శుక్రవారం మంగళగిరి వచ్చిన ఆమెను చూసి పవన్ భావోద్వేగానికి గురయ్యారు. తనతో కలిసి భోజనం చేయాలనే అవ్వ కోరికను నెరవేర్చారు. గ్రామంలో అమ్మవారి గుడిని పునరుద్ధరించాలని ఆమె పవన్కు విజ్ఞప్తి చేయగా వారంలో పని మొదలుపెడతానని హామీ ఇచ్చారు. కారు దాకా నడిచి వచ్చి సాదరంగా వీడ్కోలు పలికారు.