AP Govt: కొత్త జిల్లాలు.. పాత పద్ధతులు
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:43 AM
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వాటిని చేర్చకపోవడంతో ప్రజలు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేంద్రం స్పందించకపోవడంతో నియామకాలు, బదిలీలు, ప్రవేశాల్లో పురోగతి లేకుండా మూడున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి.
కొత్త జిల్లాల పేర్లను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చని కేంద్రం
పాత జిల్లాల కేంద్రంగానే కార్యకలాపాలు... కొత్త జిల్లాల ప్రజలకు ఇబ్బందులు
నియామకాలు, ప్రవేశాలు, బదిలీల్లో దక్కని లబ్ధి.. మూడున్నరేళ్లుగా పెండింగ్
నాటి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు.. కేంద్ర ప్రభుత్వ స్పందనా రాహిత్యం మరోవైపు! వెరసి ‘కొత్త’ జిల్లాల కష్టాలు ఇప్పటికీ తీరడంలేదు. నాడు అనాలోచితంగా, అశాస్త్రీయంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసేశారు. కానీ.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో వాటిని చేర్చే దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఉద్యోగ నియామకాలు, బదిలీలు, విద్యాలయాల్లో ప్రవేశాల్లో కొత్త జిల్లాల ప్రజలు లబ్ధి పొందలేకపోతున్నారు. నేటికి పాత జిల్లాలే యూనిట్గా ఆయా ప్రక్రియలు సాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడి 38 నెలలవుతున్నా ఇదే పరిస్థితి.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
గత జగన్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 3వ తేదీన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. లోక్సభ స్థానాలను ప్రామాణికంగా తీసుకొని 13గా ఉన్న ఉమ్మడి జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 26గా విభజించింది. ఇందులో కొన్ని జిల్లాలు, వాటి కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ ల ఏర్పాటు పూర్తిగా వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగిందన్న విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత వాటిని 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలి. రాష్ట్ర విభజన సమయంలో 2014 నాటికి ఏపీకి 13 జిల్లాలున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఆ మేరకు సవరించారు. ఇప్పుడు ఈ ఉత్తర్వు ఆధారంగానే ఉద్యోగ నియామకాలు, బదిలీలు, విశ్వవిద్యాలయ ప్రవేశాలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగానే అన్నీ అమలవుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి మొత్తం 26 ఏర్పాటు చేసినప్పుడు ఆ విషయాన్ని తిరిగి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలి. దీనికోసం జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖరాయాల్సిఉంది. అదేమిటోగానీ, జగన్కు కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణపై ఉన్న శ్రద్ధ జిల్లాల ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకునే విషయంలో లేకుండాపోయింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన 18నెలల తర్వాత అంటే, 2023 నవంబరులో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోరుతూ కేంద్ర హోమ్శాఖకు లేఖ రాశారు. 2024 జనవరిలో మరోసారి లేఖ రాశారు. అప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. కేంద్రం వద్ద నాడు జగన్ తనకున్న ప్రాబల్యాన్ని ఉపయోగించి ఈ విషయంలో సానుకూల నిర్ణయం పొందలేకపోయారు.
ఆ ఉత్తర్వును సవరించండి ప్లీజ్
కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉపాధ్యాయ నియామకాల కసరత్తు మొద లుపెట్టింది, కొత్త జిల్లాల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రయత్నించగా, రాష్ట్రపతి ఉత్తర్వులు ఇంకా సవరణ కాలేదని, పెండింగ్లోనే ఉందని తెలిసింది. దీంతో వెంటనే కొత్త జిల్లాల అంశాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని కోరుతూ 2024 సెప్టెంబరులో కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకొని కేంద్రం అదేనెల 25న ఒకసారి, అక్టోబరులో మరోసారి ఏపీ సర్కారుకు లేఖలు రాసింది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై పలు సందేహాలు లేవనెత్తి వివరణలు కోరింది. వెంటనే రాష్ట్ర సర్కారు గత అక్టోబరు 24న, ఈ ఏడాది ఫిబ్రవరి 10న లిఖితపూర్వక వివరణలు పంపించింది. దీనిపై కేంద్ర హోమ్శాఖ స్పందించలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ఫైలు ఇంకా కేంద్ర హోమ్శాఖ పరిశీలనలోనే పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్ కె .విజయానంద్ ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ, ‘ఇంకెప్పుడు సమస్యను పరిష్కరిస్తా’రంటూ గత గురువారం కేంద్ర హోమ్శాఖ కార్యదర్శికి లేఖరాశారు. ‘‘మీరు అడిగిన అనేక సందేహాలకు సవివరమైన వివరణలు ఇచ్చాం. ఎలాంటి తప్పుడు అవగాహనకు వీలులేకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఉద్యోగుల స్థానికత, నియామకాలు) ఆర్డర్ 2025 ముసాయిదాను మీకు పంపించాం. కాబట్టి వీలైనంత త్వరగా దాన్ని ఆమోదించి గజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించగలరు. ఆ సమాచారం మాకు వెంటనే అందించగలరు’’ అని సీఎస్ ఆ లేఖలో కోరారు.
బదిలీల నుంచి స్థానికత దాకా.. సమస్యలే
కేంద్రం సకాలంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడి మూడేళ్లు దాటినా ఇంకా ఉద్యోగుల విభజన జరగలేదు. ఉద్యోగుల స్థానికత ఏమిటో సర్కారు తేల్చలేకపోయింది. 2022లో ఉద్యోగుల సర్దుబాటు ఉత్తర్వులే అమల్లో ఉన్నాయి. ఫలితంగా బదిలీల సమస్య జటిలమవుతోంది. కొత్త జిల్లాల ఉద్యోగులు తమ సొంత ప్రాంతంలో బదిలీ పొందలేకపోతున్నారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికతా అంశం తీవ్రంగా ఉంది. పాత జిల్లాల కేంద్రంగానే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో నియామకాలు అదే ప్రాతిపదికన చేపడితే, ఇక కొత్త జిల్లాల ఏర్పాటువల్ల కలిగే ప్రయోజనం ఏమీ దక్కే అవకాశం లేదు.