Nara Lokesh : భారీ మెజారిటీ రావాలి
ABN , Publish Date - Feb 19 , 2025 | 06:04 AM
‘ప్రతిపక్షం పోటీలో లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. పార్టీ నేతలంతా రాబోయే వారం రోజులు ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి పెట్టి పనిచేయాలి’
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి లోకేశ్ సమీక్ష
ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ‘ప్రతిపక్షం పోటీలో లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. పార్టీ నేతలంతా రాబోయే వారం రోజులు ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి పెట్టి పనిచేయాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉభయగోదావరి, గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంగళవారం ఉండవల్లి నివాసంలో పార్టీ నేతలతో లోకేశ్ సమీక్షించారు. ప్రతి ఓటరును పార్టీ నేతలు నేరుగా కలవాలని, అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేలా చొరవ చూపాలని సూచించారు. కూటమి నేతలను కలుపుకొని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నికలు జరిగే 67 నియోజకవర్గాల్లో క్లస్టర్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈ ఎన్నికలను సీరియ్సగా తీసుకోవాలని నిర్దేశించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం బుధవారం నుంచి ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నామని తెలిపారు. సమావేశంలో ఎంపీ భరత్, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.