లబ్ధిదారుల ఎంపికలో మినహాయుంపులివ్వండి: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:22 AM
ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్ధసారథి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్ధసారథి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ శుక్రవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. పీఎంఏవై గ్రామీణ్-2.0 లబ్ధిదారుల ఎంపిక విషయంలో 10 అంశాలు పరిగణించాలని కేంద్రం పేర్కొందని, వాటి పరిధిలోకి వచ్చేవారిని ఆటోమేటిక్గా అనర్హులుగా ప్రకటిస్తున్నారని తెలిపారు. వాటిలో 3 అంశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 3, 4 చక్రాల వ్యవసాయ యంత్ర పరికరాలు, వాహనాలు కలిగినవారు, రూ.50వేలకు మించి క్రెడిట్ లిమిట్ కలిగిన కిసాన్ క్రెడిట్ కార్డులు కలిగినవారిని అనర్హులుగా ప్రకటించారని వివరించారు. అయితే ఎంతోమంది రుణంతో ఆటోలు, టాక్సీలు కొనుగోలు చేసుకుని బతుకుతున్నారని, వారిని అనర్హులుగా ప్రకటించడం సరికాదన్నారు.