YSRCP Corruption: పెద్దమంత్రి అవినీతి కూడా పెద్దదే
ABN , Publish Date - May 17 , 2025 | 04:25 AM
వైఎస్సార్సీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. హంద్రీ-నీవా కాలువ పనులపై ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోందని, అనుమతి లేకుండా నిర్మించిన మూడు రిజర్వాయర్లపై గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు.
వెలుగులోకి ప్రాజెక్టుల్లో అక్రమాలు... త్వరలోనే చర్యలు
జూన్ నెలాఖరుకు హంద్రీనీవా మొదటి దశ పూర్తి: మంత్రి నిమ్మల
మదనపల్లె, పుట్టపర్తి, మే 16(ఆంధ్రజ్యోతి): అయిదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు రిజర్వాయర్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి’ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెళ్తున్న హంద్రీ-నీవా ప్రాజెక్టు లైనింగ్ పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం దొమ్మన్నబావి వద్ద హంద్రీ-నీవా కాంక్రీటు పనులను, శ్రీసత్యసాయి జిల్లా మలకవేముల వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువ లైనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం కుప్పం పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో మదనపల్లె బైపాస్ రోడ్డు వద్ద మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వంలో ఆయన పెద్ద మంత్రేకాదు.. అవినీతి కూడా పెద్దదే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ నిర్మాణంలో నిబంధనలు అతిక్రమించడమే కాదు.. భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్ విచారణలో అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. త్వరలోనే పెద్దరెడ్డిపై చర్యలు ఉంటాయి.
ఈ మూడు ప్రాజెక్టులకూ అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారంటూ గ్రీన్ట్రైబ్యునల్కి రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ట్రైబ్యునల్... ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది. అయితే వీటిని స్వలాభం కోసం నిర్మించి రూ.కోట్లు నొక్కేసిన పెద్దరెడ్డి.. రూ.25 కోట్లు అపరాధం కూడా ప్రభుత్వం నుంచి చెల్లించ్టారు. అది ఆయన సొంత డబ్బులు చెల్లించి ఉంటే బాగుండేది. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వెడల్పు మొదటి దశ పనులను జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. కాలువ లైనింగ్, వెడల్పు పనులకు ప్రభుత్వం రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తోంది. విస్తరణ పనులు పూర్తయితే కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్యులకు పెరుగుతుంది. ఐదు నెలల్లో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. మొదటి దశ పనులు వచ్చే నెలలో పూర్తి చేస్తాం. పుంగనూరు ఉప కాలువ లైనింగ్ పనులను రూ.480 కోట్లతో ఈఏడాది జనవరిలో ప్రారభించాం. హంద్రీనీవా ప్రాజెక్టుకు 2014-19లోనే టీడీపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత ద్రోహం, అన్యాయం జగన్ రాయల సీమకు చేశారు’ అని నిమ్మల విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News