బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:41 PM
ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ పట్టణ కార్యాదర్శి రంగన్న, సీపీఐ ఎంఎల్ న్యూ డెమెక్రసీ నాయకుడు రాజు కోరారు.
ఎమ్మిగనూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ పట్టణ కార్యాదర్శి రంగన్న, సీపీఐ ఎంఎల్ న్యూ డెమెక్రసీ నాయకుడు రాజు కోరారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పనిచేస్తూ మృతిచెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాల సభ్యులు, కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరాహార దీక్ష శనివారం ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు పోస్టుకార్డులు పంపించారు. నాయకులు తిమ్మగురురుడు, ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటిలో ఏళ్ల తరబడి పారిశుద్యకార్మికులుగా పని చేస్తూ 13మంది మృతి చెందారని తెలిపారు. వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అధికారం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు ఉన్నప్పటికీ ఐదేళ్లగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నాయకులు విజేంద్ర, ఎల్లప్ప, శివ, భీమన్న గౌడ్, రాజు, విక్రం, కిరణ్, ప్రతాప్ పాల్గొన్నారు.