వాహనదారులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:20 AM
రోడ్డు భద్రత మాసోత్సవాలలో వాహన చోదకులను భాగస్వాములు చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.

నంద్యాల కల్చరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత మాసోత్సవాలలో వాహన చోదకులను భాగస్వాములు చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలు, ఫ్లెక్సీని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, వాహనచోదకులు, ప్రజలు, విద్యార్థులను భాగస్వాములను చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన అంఽశాలపై అవగాహన కల్పించాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు సంబంధిం చిన బ్లాక్ స్పాట్స్ గుర్తించి క్లియర్ చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్దాలను వివరించి వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ వివరించారు.
ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చునని ఆత్మకూరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ వినయ్కుమార్ అన్నారు. గురువారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఆర్టీసీ డిపోలోని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన డ్రైవర్లతో రోడ్డు నియమాలు పాటించి ప్రమాదాలను నివారిస్తామని పేర్కొంటూ ప్రతిజ్ఞ చేయించారు.
నందికొట్కూరు(ఆంధ్రజ్యోతి): రోడ్డు నిబంధనల పట్ల ప్రయాణి కులు అవగాహన కలిగి ఉండాలని నందికొట్కూరు పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్రావు సూచించారు. పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రారంభమైన రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రయాణికులు రోడ్డుపై ప్రయాణించే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, నిబంధనల ప్రకారం నిర్దేశిత వేగంలోనే వాహనాలు నడపాలని ఆయన సూచిం చారు. ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు రోడ్డుపై ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలను ఆయన వివరించారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ డిపో ట్రాఫిక్ సీఐ సరోజినమ్మ, ఏఎంఎఫ్ ప్రమిళ, యూనియన్ జాయింట్ సెక్రటరీ విజయుడు, నాయకులు స్వామి పాల్గొన్నారు.