Share News

నల్లమలలో మంటలు

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:47 AM

గత పది రోజుల నుంచి నల్లమల అడవి నిప్పునకు గురై కాలిపోతోంది.

నల్లమలలో మంటలు
మహానంది సమీపంలోని నల్లమల అడవిలో కాలిపోతున్న చెట్లు

మహానంది, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): గత పది రోజుల నుంచి నల్లమల అడవి నిప్పునకు గురై కాలిపోతోంది. దీంతో అందులోని వన్యప్రాణులు ప్రాణభయంతో పురుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకుంటున్నా...మరికొన్ని భయంతో ప్రాణులు కోల్పోతున్నాయి. ఇదిలా ఉండగా నల్లమల సమీప గ్రామాల ప్రజలు వేసవి కాలంలో అడవికి నిప్పు అంటుకోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి ఏడాది ఇలా జరుగుతున్నా అటవీశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

వేలాది హెకార్లల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవిలో మంటలు చెలరేగి నప్పుడు అరకొర సిబ్బందితో మంటలను నివారించడం సాధ్యం కావడంలేదు. అగ్నిమాపక వాహానాలు దట్టమైన అడవిలోకి వెళ్లడం వీలు కుదరడం లేదు. పైగా వేషవికాలం కావడంతో నీటినిల్వలు పూర్తిగా అంతరించి పోవడంతో సిబ్బందికి మంటలను ఆర్పడం కత్తిమీద సాములాగా మారింది. శుక్రవారం మహానంది సమీపంలోని నల్లమల అడవిలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ హైమావతి ఆధ్వర్యంలో 6 మంది సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించిన సాధ్యం కాలేదు.

డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ హైమావతి మాట్లాడుతూ ఆకతాయిలు చేస్తున్న వికృత చేష్టల వల్ల అడవికి నిప్పు అంటుకొని కాలిపోతోందని అన్నారు. దీనిపై ముందు జాగ్రత్తగా చర్యలుగా ఉన్న సిబ్బందికి అటవీశాఖ ఉన్నతాధికార్లు శిక్షణ ఇచ్చామని చెప్పారు. సాధ్యమైనంత వరకు సిబ్బందితో మంటలను అదుపులోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 12:47 AM