శ్రీమఠంలో భక్తుల రక్షణకు ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:09 PM
రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా, అవాంఛ నీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, ఆహ్లాద కరమైన వాతావరణంలో భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు.
మంత్రాలయం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి కొలువై ఉన్న శ్రీమఠంలో భక్తుల రక్షణకు ప్రాధాన్యమిస్తామని శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అన్నారు. దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సెలవు రోజుల్లో వివిధ రాష్ట్రాల నుంచి భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని శ్రీమఠంలో పీఠాధిపతి పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన భక్తుల తొక్కిసలాటలో చాలా మంది మృతి చెందారని, ఇలాంటి ఘటనల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్వామీజీ మఠం సిబ్బందికి సూచించారు. పీఠాధిపతి వెంట మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, హరినాథ్, సీఐ రామాంజులు, ఎస్ఐ శివాంజల్, మురళిస్వామి తదితరులు ఉన్నారు.