గుంతలో పడ్డ బస్సు
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:11 AM
మండలంలోని పెద్దనేలటూరు గ్రామ శివారులో శనివారం సాయంత్రం ఆర్టీసీ విద్యార్థి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడబోయి ఒక సైడ్కు ఒరిగింది.
గోనెగండ్ల, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దనేలటూరు గ్రామ శివారులో శనివారం సాయంత్రం ఆర్టీసీ విద్యార్థి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడబోయి ఒక సైడ్కు ఒరిగింది. గోనెగండ్ల మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఎమ్మిగనూరుకు చెందిన ఏపీ 21జెడ్ 0445 అనే బస్సును ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మోడల్ స్కూల్ నుంచి హెచ్ కైరవాడి, పెద్దనేలటూరు విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని గ్రామాలకు బయలుదేరింది. ఆ బస్సులో హెచ్ కైరవాడి, గోనెగండ్లకు వచ్చేందుకు పెద్దనేలటూరు చెందిన బోయ లక్ష్మీదేవమ్మ, మహిళా కానిస్టేబుల్, కోడుమూరు కు చెందిన ఒక ఫొటో గ్రాఫర్ ఎక్కారు. గ్రామ శివార్లు దాటగానే బస్సుకు ఎదురుగా వచ్చిన ఎద్దు బండిని తప్పించేందుకు డ్రైవర్ రాకేష్(కాంట్రాక్ట్ బేసిక్ డ్రైవర్) బస్సును రోడ్డు పక్కకు దించాడు. అక్కడ వర్షం బురద ఉండటంతో బస్సు అదుపుతప్పి గుంతలో పడబోయింది. అక్కడ విద్యుత్ స్తంభం ఉండటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న బోయ లక్ష్మీదేవమ్మ కుడికాలుపై స్టెప్నీ టైర్ పడింది. ఆమె కాలు విరిగింది. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలంను చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఎమ్మిగనూరు ఆర్టీసీ డీఎం మద్దిలేటినాయుడు తెలిపారు.