Kurnool Tahsildar Office Incident: 10 వేలు తీసుకున్నావ్ సమస్య తీర్చవా
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:33 AM
కర్నూలు జిల్లా కోడుమూరులో తన భూమిని ఆన్లైన్ చేయకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ పురుగుల మందు తాగేందుకు యత్నించింది. అధికారుల అవినీతి, వేధింపులతో విసిగిపోయిన ఆమె తన బాధను చెబుతూ ఆత్మహత్య ప్రయత్నానికి దిగింది

ఎమ్మార్వోను నిలదీసిన మహిళ
వీఆర్వోలు లక్ష తిన్నారంటూ ఆత్మహత్యాయత్నం
కోడుమూరు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ‘నా భూమిని ఆన్లైన్ చేస్తానని రూ.10 వేలు తీసుకున్నావ్. మీ వీఆర్వోలు లక్ష తినేశారు. పైగా కోరిక తీర్చమంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఇది ఎమ్మార్వో కార్యాలయమేనా? లేక..... ’ అంటూ ఓ బాధితురాలు మంగళవారం కర్నూలు జిల్లా కోడుమూరు తహశీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసుకుంది.చాకలి హైమావతి అనే వివాహిత కోడుమూరులో నివసిస్తోంది. ఆమె తండ్రికి ప్యాలకుర్తి గ్రామంలో తొమ్మిది ఎకరాల భూమి ఉంది. తండ్రి మరణానంతరం ఆ భూమిని మొదటి భార్య కుమారుడు లక్ష్మన్న స్వాధీనం చేసుకున్నాడు. అందులో సగ భాగం ఆమెకు చెందుతుందని 2023లో కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకు తనకు భూమి అప్పగించి, ఆన్లైన్ చేయాలని ఆనాటి నుంచి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం కార్యాలయానికి వెళ్లిన ఆమె.. తహసీల్దార్ వెంకటేశ్నాయక్ ఎదుటే పురుగుల మందు డబ్బా తీసి.. తాగేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని తహసీల్దార్ అడ్డుకుని, చేతిలోని పురుగుల మందు బాటిల్ను లాగేశారు.