Share News

Heavy Floods Hit Krishna and Godavari: కృష్ణా, గోదావరికి మళ్లీ భారీ వరద

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:59 AM

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి మళ్లీ పెరిగింది...

Heavy Floods Hit Krishna and Godavari: కృష్ణా, గోదావరికి మళ్లీ భారీ వరద

  • ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 4.25 లక్షల క్యూసెక్కులు

  • పోలవరం నుంచి దిగువకు 6.98 లక్షల క్యూసెక్కులు

  • 18 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

  • నేడు కోస్తా, రాయలసీమలో వర్షాలు

  • నిమజ్జనంలో హెచ్చరికలు పాటించాలి: విపత్తుల సంస్థ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి మళ్లీ పెరిగింది. కృష్ణానదిలో శ్రీశైలం డ్యాం వద్ద ఇన్‌ఫ్లో 2.38 లక్షలు, ఔట్‌ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,67,940 క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుంచి 3,74,212 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి 4,25,165 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో బ్యారేజీ 69 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలోనూ నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. భారీ వర్షాలకు గోదావరి ఉప నదులు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 6,98,782 క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 38.6 అడుగులకు చేరుకుంది. వేలేరుపాడు వద్ద గోదావరి వరద ఉఽధృతి కారణంగా ఎద్దువాగు వంతెన మునిగిపోయింది. వేలేరుపాడు-రుద్రమకోట మధ్య కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు ముంపునకు గురయ్యాయి. కాగా, కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతంగా వస్తోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గణపతి విగ్రహాల నిమజ్జన సమయంలో నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను అనుసరించాలని పేర్కొంది.


3న మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రానికి మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నెల మూడో తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తాయంది.

ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 04:59 AM