Rural Development: ఉపాధిలో చేసిన పనులే మళ్లీ మళ్లీ
ABN , Publish Date - Jun 29 , 2025 | 05:56 AM
ఉపాధి హామీ పథకంలో ఒకసారి చేసిన పనులే మళ్లీ మళ్లీ వేర్వేరు పేర్లతో, అదే ప్రాంతంలో చేస్తున్నారని, దీనిని అరికట్టేందుకు జియో ఫెన్సింగ్ చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిణి ఆర్ భజిభకరే అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించారు.
ప్రతి పనికీ జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో ఒకసారి చేసిన పనులే మళ్లీ మళ్లీ వేర్వేరు పేర్లతో, అదే ప్రాంతంలో చేస్తున్నారని, దీనిని అరికట్టేందుకు జియో ఫెన్సింగ్ చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిణి ఆర్ భజిభకరే అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించారు. 10 మీటర్ల పరిధిలో జియోఫెన్సింగ్ చేయడం ద్వారా దీనిని నియంత్రించవచ్చన్నారు. దీనిపై సిబ్బందికి వెంటనే శిక్షణ ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై రోహిణీ ఇటీవల అన్ని రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి పథకంలో ఏడు రిజిస్టర్ల నిర్వహణ మరింత మెరుగుపడాలని, బిల్లులు, పన్ను రశీదులు, రాయల్టీ రశీదులకు సంబంధించిన వివరాలు తనిఖీల్లో కనిపించట్లేదన్నారు. పలు రాష్ట్రాల్లో మెటీరియల్ పనుల కోసమే శ్రామికులకు పనులు కల్పిస్తున్నారన్నారు. అధిక పని దినాల కల్పన జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పలు సూచనలు ఇచ్చారు.