CM Chandrababu: దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించడు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:57 AM
దొంగ దండాలు పెట్టినంత మాత్రాన వినాయకుడు క్షమించడని, వాళ్ల సంగతి చూస్తాడని సీఎం చంద్రబాబు అన్నారు. డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో...
గత ఐదేళ్లూ వినాయక చవితి వేడుకలకు ఆంక్షలు
మేమొచ్చాక ఆనందంగా పండుగ: చంద్రబాబు
విజయవాడ (విద్యాధరపురం), ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): దొంగ దండాలు పెట్టినంత మాత్రాన వినాయకుడు క్షమించడని, వాళ్ల సంగతి చూస్తాడని సీఎం చంద్రబాబు అన్నారు. డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతి మట్టి విగ్రహాన్ని సీఎం బుధవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చవితి ఉత్సవాలు చేసుకోవాలంటే అన్నీ విఘ్నాలేనని, పండుగ చేసుకోవాలన్నా, మైక్ పెట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టేవారని ఆరోపించారు. విజయవాడలో డూండీ సేవా సమితి ఆధ్వర్యంలో ఐదేళ్ల పాటు చవితి ఉత్సవాలు జరగలేదని గుర్తుచేశారు. 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే నిమజ్జన ఏర్పాట్లు చేసిన డూండీ సేవా సమితి సభ్యులను చంద్రబాబు అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


వినాయకుడి చెంతనే.. ఎలుక
వినాయక చవితి పండుగ రోజున వినాయకుడి వాహనమైన ఎలుక.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రామచంద్రాపురంలోని గెడా సుబ్రహ్మణ్యం ఇంట్లో సందడి చేసింది. ఇంట్లోని పూజ గదిలో పసుపు ముద్దతో చేసిన వినాయకుడి ప్రతిమపై ఎక్కుతూ దిగుతూ విన్యాసాలు చేసింది. ఇంట్లో వాళ్లు పెట్టిన కుడుములు, యాపిల్ కొద్దిగా తిని, గిన్నెలో పెట్టిన నీరు తాగింది. సుమారు మూడు గంటలపాటు గదిలో నుంచి కదలకుండా ఉన్న ఆ ఎలుకకు ఆ ప్రాంత మహిళలు హారతులు ఇచ్చి పూజలు చేశారు. కొద్దిగా చప్పుడు వినిపిస్తేనే పారిపోయే ఎలుక.. అంతసేపు కదలకుండా ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది.
- జంగారెడ్డిగూడెం, ఆంధ్రజ్యోతి
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..