CPI : న్యూడెమోక్రసీ ఏపీ కార్యదర్శిగా దివాకర్
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:17 AM
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీలో రెండు గ్రూపులు విలీనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా గాదె దివాకర్ ఎన్నికైనట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధులు...

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీలో రెండు గ్రూపులు విలీనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా గాదె దివాకర్ ఎన్నికైనట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధులు పి. ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో న్యూడెమోక్రసీలో భారీ చీలిక ఏర్పడింది. పార్టీ నుంచి చంద్రన్న వర్గం వేరుపడింది. ఆ తర్వాత ఆ వర్గంలోనూ అనేక వైరుధ్యాలు పొడసూపాయి. దీంతో ఆయనతో వెళ్లిపోయిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు గతేడాది నుంచే విలీన చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో చర్చలు ఫలించి రెండు గ్రూపులు ఒక్కటయ్యాయి. దీనికి సూర్యం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఏపీలోనూ ఈ నెల 28, 29 తేదీల్లో విలీన చర్చలు జరిగాయి. చంద్రన్న వర్గం నుంచి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సాగర్, విష్ణు, మేకల ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. రెండు వర్గాల విలీనం అనంతరం ఏపీకి కొత్తగా రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గాదె దివాకర్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనట్లు అధికార ప్రతినిధులు వెల్లడించారు. త్వరలో ప్రజాసంఘాల విలీన కార్యక్రమాలు ఉంటాయని, ఫిబ్రవరి 23న విజయవాడలో విలీన సభ నిర్వహిస్తామని వారు తెలిపారు.