Property Dispute : ఆస్తి కోసం ఆగిన అంత్యక్రియలు
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:31 AM
కుమారుడి మృతదేహాన్ని తమ ఇంటి వద్ద పెట్టవద్దంటూ తల్లి, సోదరి తెగేసి చెప్పారు. ఆస్తి విషయం తేల్చాల్చిందేనని భీష్మించారు.

రెండ్రోజులుగా ఇంటి వద్దే యువకుడి మృతదేహం
ససేమిరా అంటున్న తల్లి, సోదరి.. రోదిస్తున్న భార్య
గిద్దలూరు టౌన్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తూ మరణించిన కుమారుడి మృతదేహాన్ని తమ ఇంటి వద్ద పెట్టవద్దంటూ తల్లి, సోదరి తెగేసి చెప్పారు. ఆస్తి విషయం తేల్చాల్చిందేనని భీష్మించారు. రెండ్రోజులుగా ఇంటి ముందే మృతదేహం ఉన్నా అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. అందిన సమాచారం మేరకు గిద్దలూరు పట్టణానికి చెందిన హయగ్రీవ శివాచారి(32) కొంతకాలంగా హైదరాబాద్లో భార్య, 3 సంవత్సరాల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన శివాచారి ఈ నెల 7న ఇంటిపై నుంచి కిందపడి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. భర్త మృతదేహాన్ని తీసుకొని 8న ఈశ్వరి గిద్దలూరుకు వచ్చారు. శనివారం వైశ్యాబ్యాంక్ వీధిలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ శివాచారి తల్లి, సోదరి తమ ఇంటి వద్ద శవాన్ని పెట్టవద్దంటూ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. బంధువులు కూడా ఆ ప్రాంతానికి రాలేదు. దీంతో శనివారం, ఆదివారం భర్త శవం వద్ద ఈశ్వరి రోదిస్తూనే ఉంది. ఆదివారం సాయంత్రం సమాచారం అందుకున్న గిద్దలూరు అర్బన్ సీఐ సురేశ్ అక్కడికి చేరుకొని శివాచారి తల్లి, సోదరి, భార్యతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. అయితే ఆస్తుల విషయం తేలే వరకు అంత్యక్రియలు చేయబోమని వారు తేల్చిచెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి