CM Chandrababu : నాకంతా తెలుసు..!
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:02 AM
మంత్రి బీసీ జనార్దన్రెడ్డితో కలసి సమన్వయంతో పని చేసుకోండి’’ అని సీఎం చంద్రబాబు ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డికి సూచించారు.

సమన్వయంతో పనిచేసుకోండి
ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘నాకంతా తెలుసు. ఫైబర్నెట్లో అసలు ఏం జరిగిందో ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉంది. మంత్రి బీసీ జనార్దన్రెడ్డితో కలసి సమన్వయంతో పని చేసుకోండి’’ అని సీఎం చంద్రబాబు ఫైబర్నెట్ చైర్మన్ జీవీ రెడ్డికి సూచించారు. అంతేకాదు.. ఫైబర్ నెట్ విషయంలో ఏం చేయాలో.. ఎలా చేయాలో కూడా తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. ‘‘మీరు తెలివైన వారు. మీ తెలివితేటలను సంస్థ పురోభివృద్ధికి ఉపయోగించండి. పార్టీ కోసం మీరు చేసిన కృషి నాకు తెలుసు’’ అని జీవీ రెడ్డిని ఉద్దేశించి సీఎం అన్నారు. శనివారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో జీవీ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రోజుల కిందట ఫైబర్నెట్ ఎండీ దినేశ్కుమార్పై చైర్మన్ జీవీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వ, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. దీంతో ముఖ్యమంత్రిని కలసి వివరణ ఇవ్వాలని జీవీ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో జీవీ శనివారం సచివాలయంలో సీఎంను కలసి.. మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ.. తనకంతా తెలుసునని.. అందరూ కలిసి పనిచేసుకోవాలని జీవీకి చంద్రబాబు సూచించారు.