CM Chandrababu: గ్రీన్ హైడ్రో గ్లోబల్ హబ్గా ఏపీ
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:08 AM
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. ప్రపంచ కేంద్రంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తిరుపతి జిల్లా ఏర్పేడులో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం
వర్చువల్గా ప్రారంభించిన సీఎం.. వెయ్యి కోట్లతో ప్లాంట్ ఏర్పాటు
స్థానికంగా 2 వేల మందికి ఉపాధి
తిరుపతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. ప్రపంచ కేంద్రంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగాలి గ్రామ సమీపంలోని రాక్మెన్ ఇండస్ట్రీ్సలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ఉండవల్లి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చే లక్ష్యానికి ఇది తొలి అడుగవుతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఏడాదికి 25 టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంటు ఏర్పాటు చేసినా.. 54 టన్నులకు పెంచుకునే అవకాశముందన్నారు. మొత్తం రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ప్లాంట్ ద్వారా స్థానికంగా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్లాంటు వల్ల ఏడాదికి 206 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు వాతావరణంలోకి ఏడాదికి 190 టన్నుల నుంచీ 195 టన్నుల వరకూ ఆక్సిజన్ విడుదల అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల కోసం సీఎన్జీ, ఎల్పీజీలతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని వివరించారు. ఈ సాంకేతిక విధానం కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందన్నారు.
దేశానికి ఆదర్శంగా..
తిరుపతి జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ విధానం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో, అలాగే దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లో కూడా అనుసరించడానికి వీలుగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ప్రకారం 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, రూ. 10 ట్రిలియన్ల పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం కలుగుతోందన్నారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తోందని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు.
దేశ, ప్రపంచ మార్కెట్లకు అనువుగా ఏపీ
ఓడరేవులు, బలమైన లాజిస్టిక్ నెట్ వర్కు కలిగి వున్న ఏపీ దేశ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి అనువుగా ఉందన్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా ఆవిర్భవించడానికి కూడా ఏపీ అనువుగా ఉందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న వనరులను వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగాలిలోని రాక్మెన్ ఇండస్ట్రీ్సలో జాయింట్ కలెక్టర్ శుభమ్ బన్సాల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీనివాస్ అయ్యర్, రాక్మన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజాల్, సీఈవో కౌశిక్ మన్నా, ఓహ్మియం ఇంటర్నేషనల్ సీఈవో ఆర్నే బలంటైన్, స్థానిక ప్లాంట్ హెడ్ జగదీశన్, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకా్షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.