Central Govt Alerts: గ్రిడ్ కుప్పకూలకుండా చూడండి
ABN , Publish Date - May 10 , 2025 | 04:21 AM
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం ఉండటంతో, రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్ను సమతుల్యం చేయాలని కేంద్ర ఇంధన శాఖ సూచించింది. గ్రిడ్ వ్యస్థను రక్షించేందుకు ఎస్ఈఎల్డీసీలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది

పాక్తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం సూచన
అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇది ట్రాన్స్మిషన్ గ్రిడ్పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేని రాష్ట్రాల్లో డిమాండ్ అమాంతం పెరిగితే.. స్థానికంగా లభ్యమయ్యే కరెంటు సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ గ్రిడ్ తీవ్ర ప్రభావానికి గురవుతుంది. గ్రిడ్ కుప్పకూలే ప్రమాదం కూడా ఉంటుంది. దానిని పునరుద్ధరించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులను నివారించేందుకు రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్ మరీ ఎక్కువగా, మరీ తక్కువగా ఉండకుండా సమన్వయం చేసుకోవాలని, గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలకుండా చూసుకోవాలని కేంద్ర ఇంధన శాఖ సూచించింది. దీనివల్ల గ్రిడ్ కుప్పకూలకుండా ఉంటుందని స్పష్టం చేసింది. పాకిస్థాన్తో ఉద్రిక్తతలు తీవ్రమైనప్పటికీ దక్షిణాది రాష్ట్రాలపై విద్యుత్ సరఫరా ఆంక్షలేవీ లేవు. రాత్రి వేళల్లో సరఫరా ఆపేయాలంటూ కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. అయినప్పటికీ.. గ్రిడ్ సామర్థ్యంపైన, కరెంటు హెచ్చుతగ్గులపైన అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల విద్యుత్ లోడ్ డిస్పాచ్ సెంటర్ల(ఎ్సఈఎల్డీసీ)కు సూచించింది. దీంతో.. రాష్ట్ర ఎస్ఈఎల్డీసీ అప్రమత్తమైంది.