BJP MLA Eshwar Rao: అధ్యక్షా..! జగన్ నా పక్కన కూర్చుంటే సంతోషించేవాడిని
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:48 AM
‘వైసీపీ అధ్యక్షుడు (జగన్) వచ్చి నా పక్కన కూర్చుంటే చాలా సంతోషించేవాడిని అధ్యక్షా!’ అని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అన్నారు.
కొన్ని కోర్కెలు తీరవు ఈశ్వర్...సభలో బీజేపీ ఎమ్మెల్యేతో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి) : ‘వైసీపీ అధ్యక్షుడు (జగన్) వచ్చి నా పక్కన కూర్చుంటే చాలా సంతోషించేవాడిని అధ్యక్షా!’ అని ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అన్నారు. దానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ... ‘కొన్ని కోరికలు తీరవ్’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. సోమవారం శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా వారిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగింది. బడ్జెట్పై మాట్లాడడానికి ఎమ్మెల్యే ఈశ్వరరావుకు సభాపతి స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు అవకాశం ఇస్తూ... త్వరగా ముగించాలని సూచించారు. దీనిపై ఎమ్మెల్యే ఈశ్వరరావు స్పందిస్తూ... ‘నా పక్కన 11 మంది (వైసీపీ ఎమ్మెల్యేలు) కూర్చోవాలి అధ్యక్షా..! కానీ వాళ్లు రాలేదు. వాళ్ల సమయమైనా నాకివ్వండి. సభలో సభ్యులకు సీట్లు కేటాయించారు. వైసీపీ అధ్యక్షుని(జగన్)కి నా పక్క సీటే వచ్చింది. వాళ్లు మమ్మల్ని చావు వరకూ తీసుకెళ్లారు. ఈరోజు వచ్చి నా పక్కన కూర్చుంటారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాను అధ్యక్షా..!’ అని అన్నారు.