APSDMA: ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం
ABN , Publish Date - May 03 , 2025 | 08:27 PM
Thunderstorms In Andhra Pradesh: ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. సోమ,మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం 12 తర్వాత బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఎండలు కాస్తున్నాయి. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరో వైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ విచిత్ర వాతావరణంతో రైతులు బాగా నష్టపోతున్నారు. పంటల కోతల సమయంలో వానలు పడి వారిని నష్టాల పాలు చేస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. సోమ,మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవ్వరూ చెట్ల కిందకు చేరవద్దని హెచ్చరించింది. బలమైన ఈదురు గాలుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు నమోదు అవుతాయని పేర్కొంది. తిరుపతి, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వరుసగా 42, 41,41 డిగ్రీల ఎండలు నమోదు అయినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..