Minister Ram Prasad : క్రీడాభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:32 AM
ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టులకు, క్రీడా, మౌలిక సదుపాయాలు కల్పన కోసం నిధులు విడుదల చేయాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను, రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు.

కేంద్రం సహకారంతో పాలసీ, యాప్ తెచ్చాం
రాయచోటిలో స్టేడియం నిర్మాణానికి రూ.42.62 కోట్లు అవసరం
కేంద్ర మంత్రి మాండవీయను కోరిన
క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఖేలో ఇండియా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాజెక్టులకు, క్రీడా, మౌలిక సదుపాయాలు కల్పన కోసం నిధులు విడుదల చేయాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను, రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో నిర్వహించిన చింతన్ శిబిర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి రాంప్రసాద్రెడ్డి వివరించారు. ‘క్రీడాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు క్రీడల్లో కార్పొరేట్లతో భాగస్వామ్యం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో నూతన క్రీడా పాలసీ, క్రీడా యాప్ను ఆవిష్కరించాం.
రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.42.62 కోట్లు ప్రాజెక్టు సహకారం అందించాలి. రాయచోటిలో జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రం ఏర్పాటు చేయాలి’ అని రాష్ట్ర మంత్రి కోరారు. ఈ సందర్భంగా విశాఖలో దివ్యాంగులు స్పోర్ట్స్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించంపై కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్ర మంత్రి మాండవీయ ఆంగీకరించారు.