Share News

YS Sharmila: ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ?

ABN , Publish Date - Jun 22 , 2025 | 03:53 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును ఆమె ఖండించారు.

YS Sharmila: ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ?
AP PCC Chief YS Sharmila

అమరావతి, జూన్ 22: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల పర్యటన వెళ్లే క్రమంలో ఆయన కారు కింద వృద్ధుడు సింగయ్య పడిన దృశ్యాల తాలుకు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అమరావతిలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకర్ల సమావేశంలో స్పందించారు. వైఎస్ జగన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయన్నారు. ఈ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని తెలిపారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి సైతం లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? అంటూ వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. వంద మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి వైఎస్ జగన్ చేతులూపడం ఏమిటంటూ మండిపడ్డారు.


ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు. బెట్టింగ్‌లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి ఇద్దరిని బలి ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం? అంటూ వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? అంటూ వైఎస్ జగన్‌ను ఆమె నిలదీశారు. ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా? అంటూ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు.


కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? అన్నారు. ఇది పూర్తిగా వైఎస్ జగన్ బాధ్యతరాహిత్యానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్‌తోపాటు వంద మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉందని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పర్మిషన్‌కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారని సందేహం వ్యక్తం చేశారు. వారు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ప్రశ్నించారు.


ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్రపుచ్చారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే.. ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? అంటూ ఆవేదన చెందారు. కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్ అరెస్ట్‌లు చేస్తారన్నారన్నారు. అలాగే తమ పార్టీ చేసే దీక్షలను భగ్నం చేస్తారని.. ఆ క్రమంలో ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు వైఎస్ జగన్ ఏం సమాధానం ఇస్తారన్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది.. ఏం చర్యలు తీసుకొంటున్నారంటూ వారికి వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు.

Updated Date - Jun 22 , 2025 | 04:51 PM