AP State Revenue : డబ్బంటే చేదా?
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:17 AM
దేశమంతా వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్) నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కు (జీఎస్టీ) మారిన సమయంలో ఏపీలో వ్యాట్...
ఏకంగా రూ.7,733 కోట్ల వ్యాట్ బకాయి
ఏడేళ్లుగా వాణిజ్య పన్నుల శాఖ తాత్సారం
అందులో కొంత వసూలు చేసినా..రాష్ట్ర సంక్షేమానికీ, అభివృద్ధికీ ఆసరా
జీఎస్టీకి మారినప్పటి వ్యాట్, సీఎస్టీ బకాయిలివీ
దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ ఓటీఎస్ బాట
కానీ, ఏపీలో ఆ ఊసే లేదు
20% వసూలుచేసినా 1,546 కోట్లు ఖజానాకు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వందలు కాదు వేలూ కాదు... రూ.7,733 కోట్ల బకాయిలు ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిణమిస్తున్నాయి. దేశమంతా వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్) నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కు (జీఎస్టీ) మారిన సమయంలో ఏపీలో వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్(సీఎస్టీ) తదితర పన్నుల బకాయిలు సుమారు రూ.10 వేల కోట్లు పైచిలుకు ఉండేవి. అందులో నుంచి సుమారు రూ.3 వేల కోట్ల వరకు వసూలు చేసినా ఇంకా సుమారు రూ.7,733 కోట్ల బకాయిలు అలాగే ఉండిపోయాయి. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఈ బకాయిల భారాన్ని తగ్గించుకుని ఎంతో కొంత ఆదాయాన్ని ఆర్జించేందుకు వన్ టైం సెటిల్మెంట్(ఓటీఎస్) స్కీమ్ను అమలు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు ముందుగా ఓటీఎ్సను అమలు చేసి ఆదాయాన్ని రాబట్టుకోగా, ఆలస్యంగా కళ్లు తెరిచిన మన దక్షిణాది రాష్ట్రాలు గడిచిన రెండేళ్లలో ఓటీఎ్సను అమలు చేసి బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ దిశగానే ఆలోచనే చేయడం లేదు. దేశవ్యాప్తంగా వ్యాపారవర్గాలపై పరోక్ష పన్నుల భారం తగ్గించేందుకు, వస్తువులు, సేవలు... రెండింటిపైనా ఏకీకృత పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చింది. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు అమల్లో ఉన్న వ్యాట్, సీఎస్టీ తదితర పన్నుల స్థానంలో జీఎస్టీని ప్రవేశపెట్టారు. నిర్ణీత సమయాన్ని ఇచ్చి వ్యాపారులందరూ పాత పన్నుల బకాయిలు కట్టేసి, జీఎస్టీకి మారాలని కోరారు. కానీ చాలా మంది వ్యాపారులు వ్యాట్ తదితర పన్నుల బకాయిలను కట్టలేదు.
దీంతో అసలుపై పెనాల్టీలు, వడ్డీలు కలిపి ప్రస్తుతం రూ.7,733 కోట్ల బకాయిలు ఉండిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఈ బకాయిల కొండను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కరిగించలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వాణిజ్యపన్నుల డివిజన్లు ఉండగా, విశాఖపట్నంలోని రెండు డివిజన్లలో అత్యధికంగా రూ.2,073 కోట్ల బకాయిలు ఉన్నాయి.
దేశమంతా ఓటీఎస్ బాట..
వ్యాట్ బకాయిలను వసూలు చేసేందుకు దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు వన్టైం సెటిల్మెంట్ను అమలు చేశాయి. బకాయిలను వీలైనంత వరకు వదిలించుకున్నాయి. అంతెందుకు.. పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం 2022లో వన్టైం సెటిల్మెంట్ అమలు చేస్తూ జీవో ఇచ్చింది. చాలా రాష్ట్రాలు కనిష్ఠంగా 15 శాతం నుంచి 20 శాతం వరకు ఓటీఎ్సను అనుమతించాయి. మహారాష్ట్ర మాత్రం 30 శాతం, తెలంగాణ 40 శాతం అమలు చేశాయి.
మీనమేషాలు ఎందుకో...!
ఏపీలో ప్రస్తుతం వ్యాట్ తదితర పన్ను బకాయిల్లో నాన్కలెక్టబుల్ బకాయి (కోర్టుల్లో కేసులు ఉన్నవి) మొత్తం రూ.5262 కోట్లు కాగా, కలెక్టబుల్ బకాయి (ఎలాంటి వివాదం లేకుండా వసూలు చేయదగ్గవి) రూ.2471 కోట్లు ఉన్నాయి. ఈ పరిస్థితికి వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులే కారణమని చెబుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులను వేధించేందుకు ఈ బకాయిలను సాకుగా చూపుతున్నారు. ఓటీఎస్ విషయమై చాలాసార్లు ప్రతిపాదనలు తయారైనా ఉన్నతాధికారులే వాటిని కార్యరూపం దాల్చకుండా చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయు. 2024 జనవరిలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించారు. ఓటీఎస్ అమలు సాధ్యాసాధ్యాలను వ్యాపారులతో చర్చించారు. అందరి అంగీకారం తీసుకుని చివరి నిమిషంలో ఎందుకనో ఈ విధానాన్ని అమలు చేయకుండా చేతులెత్తేశారు. ఓటీఎ్సను 20శాతంగా ఖరారుచేసి వసూలు చేసినా సుమారు రూ.1,546కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవి చేతిలో ఉంటే రాష్ట్ర సంక్షేమానికీ, అభివృద్ధి పనులకూ ఎంతోకొంత ఆసరాగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
For AndhraPradesh News And Telugu News
For AndhraPradesh News And Telugu News