AP EAPCET 2025: ఇంటర్ మార్కులు సరిచూసుకోవాలి
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:12 AM
ఏపీఈఏపీసెట్ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉంటుండగా, ఇంటర్ మార్కులపై 25 శాతం వెయిటేజ్ ఉన్నందున విద్యార్థులు తమ మార్కులను వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫారం ద్వారా పరిశీలించుకోవాలి. ఎటువంటి తప్పిదాలు ఉంటే, జూన్ 5వ తేదీకి ముందుగా సవరించుకునేందుకు అవకాశముంది.
ఏపీఈఏపీసెట్ చైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్
జేఎన్టీయూకే, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీసెట్ ఫలితాలను ఈ నెల రెండో వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్నందున పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈఏపీసెట్ వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫారం ద్వారా తమ మార్కులను పరిశీలించుకోవాలని సెట్ చైర్మన్, ఉపకులపతి ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఏపీ, తెలంగాణల్లోని ఇంటర్ రెగ్యులర్ విద్యార్థుల గ్రూపు మార్కులను వెబ్సైట్లో పొందుపరిచామని ఆయన చెప్పారు. డిక్లరేషన్ ఫారంలో అందుబాటులో ఉన్న ఇంటర్ రెగ్యులర్, ఇతర బోర్డుల విద్యార్థులకు సంబంధించిన గ్రూపు మార్కుల్లో ఎటువంటి తప్పిదాలు ఉన్నా వెంటనే 0884-2359599, 2342499 ఫోన్ నెంబర్ల ద్వారా గానీ, helpdeskapeapcet@apsche.org మెయిల్ ఐడీ ద్వారా గానీ సంప్రదించి మార్కులను మెయిల్ ద్వారా అందజేయాలని ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు సూచించారు. 10+2 మార్కులను గ్రూపు మార్కులను డిక్లరేషన్ ఫారం ద్వారా అప్లోడ్ చేయని వారు, గ్రూప్ మార్కుల్లో తప్పిదాలు ఉన్న విద్యార్థులకు ఈ నెల 5వ తేదీలోపు సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్టు కన్వీనర్ తెలిపారు.