AP Cabinet Meeting: నేడు కేబినెట్ భేటీ.. ఏడాది పాలనపై కీలక చర్చ
ABN , Publish Date - May 20 , 2025 | 06:14 AM
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం జరగనుంది. ఏడాది పాలన సమీక్షతో పాటు సంక్షేమ పథకాలు, పెట్టుబడుల ఆమోదం, భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. వచ్చే జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతుంది. దానిపై ప్రధానమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధిపై పెద్ద ఎత్తున చేపట్టాల్సిన ప్రచారం, మున్ముందు అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలపై కేలండర్ రూపకల్పనపైనా చర్చించనున్నారు. ఎస్ఐపీబీ 6వ సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులపైనా చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూకేటాయింపులపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.