Share News

22న విడుదల..!

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:46 AM

ఏటా దసరా పండుగ సందర్భంగా వాహనాల కొనుగోళ్లతో షోరూమ్‌లు బిజీగా ఉండేవి. నిర్వాహకులు సైతం కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించేవారు. దీంతో వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపించేవి. ఇప్పుడు సీజన ఉన్నా అవే షోరూంలలో సందడి లేదు. మేనేజర్లు, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఆఫర్ల మీద దృష్టి పెడుతుంటే... అమ్మకాల కోసం సేల్స్‌మెన తంటాలు పడుతున్నారు. ఈనెల 22వ తేదీ నుం...

22న విడుదల..!

అందరి దృష్టి.. ఆ తేదీపైనే..!

జీఎస్టీ ఎఫెక్ట్‌..

తగ్గిన వాహనాల కొనుగోలు

షో రూంల నుంచి కదలని కార్లు, బైక్‌లు

22 పైనే కంపెనీల ఆశలు

అనంతపురం కలెక్టరేట్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఏటా దసరా పండుగ సందర్భంగా వాహనాల కొనుగోళ్లతో షోరూమ్‌లు బిజీగా ఉండేవి. నిర్వాహకులు సైతం కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించేవారు. దీంతో వినియోగదారులతో కిటకిటలాడుతూ కనిపించేవి. ఇప్పుడు సీజన ఉన్నా అవే షోరూంలలో సందడి లేదు. మేనేజర్లు, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఆఫర్ల మీద దృష్టి పెడుతుంటే... అమ్మకాల కోసం సేల్స్‌మెన తంటాలు పడుతున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ) తగ్గింపుతో ధరలు తగ్గనున్నాయి. ఇదివరకు ఉన్న 5, 12, 18, 28 శాతంగా ఉన్న పన్ను రేట్లలో ఇకపై 5, 18 పన్ను రేట్లు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు ఈనెల 3వతేదీ జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. పాలు, పనీర్‌, బిస్కెట్లు, సబ్బులు, షాంపూల నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ద్విచక్రవాహనాలు, చిన్న కార్ల వరకు ధరలు దిగిరానున్నాయి. వైద్యపరికరాలపై జీఎస్టీని 12 నుంచి 5శాతానికి తగ్గించారు. నోట్‌బుక్స్‌, పెన్సిళ్లు, క్రెయాన్లు, మ్యాప్‌లు, చార్టులపై జీఎస్టీ రద్దు చేయడంతో విద్యార్థులపై భారం తగ్గినట్లయింది. హానికర, విలాస వస్తువులపై మాత్రం 40శాతం ప్రత్యేక పన్ను విధిస్తారు. పాన మసాలాలు, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతమున్న ధరలే కొనసాగేలా పన్నులుంటాయి. కాగా నిత్యం వాడే ఫోన్లలో మాత్రం మార్పు లేకపోవడం గమనార్హం.

అందరి దృష్టి కార్లు, బైక్‌లపైనే..

జీఎస్టీ తగ్గింపుతో అందరిదృష్టి కార్లు, బైక్‌లపై పడింది. ఆటోమొబైల్‌ రంగంంపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. పెట్రోల్‌, పెట్రోల్‌-హైబ్రిడ్‌, ఎల్‌పీజీ, సీఎనజీ కార్లు (1200 సీసీ, 4000ఎంఎం లోపు), డీజిల్‌, డీజిల్‌-హైబ్రిడ్‌ కార్లు (1500సీసీ, 4000ఎంఎంలోపు మాత్రమే), త్రిచక్ర వాహనాలు (ఆటోలు తదితర), 350 సీసీలోపు ఉండే మోటారు సైకిళ్లు, రవాణా వాహనాలకు ఇది వర్తిస్తుంది. బైక్‌లపై రూ.7వేల నుంచి రూ.13వేల వరకు ధరలు తగ్గనున్నాయి. కార్లపై రూ.50వేల నుంచి రూ.1.70 లక్షల వరకు ధరలుతగ్గుతాయి. దీనికితోడు దసరా పండుగకు పదిరోజుల ముందే ఈనెల 22వ తేదీ నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో తగ్గిన అనంతరం వాహనాలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఆఫర్‌ ఇచ్చినా... కొనుగోలుపై అనాసక్తి

జీఎస్టీ తగ్గింపుతో అందరిచూపు ఈనెల 22పైనే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చినప్పటి నుంచి అంటే గత నెలాఖరు నుంచి వినియోగదారులు వాహనాల దరల తగ్గింపు కోసం వేచిచూస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో ఇప్పుడే అవే ధరలు ఇస్తాం... కొనుగోలు చేయండి అంటూ సేల్స్‌మెన, మేనేజర్లు చెబుతున్నా వారు ససేమిరా అంటున్నారు. ఇలా ఆఫర్‌ ఇచ్చినా ఆసక్తి చూపకపోవడంతో వాహనాల షోరూంల నిర్వాహకులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ‘ఇప్పుడు వద్దులే బాబు... కొత్త పన్నులు అమలయ్యాకే తీసుకుంటాం’ అని స్పష్టం చేస్తున్నారు. కొత్త ధరలు వచ్చాక లైఫ్‌ టాక్స్‌ తగ్గుతుందని భావిస్తుండటంతో కొనడానికి ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది.

పడిపోయిన బైక్‌లు, కార్ల

అమ్మకాలు

జీఎస్టీ కొత్త విధానంలో బైక్‌లు, కార్ల కొనుగోలుపై తీవ్ర ప్రభావం చూపింది. అమ్మకాలు భారీగా తగ్గాయి. ప్రతినెలా 200 వాహనాలు అమ్మే ఓ బైక్‌ షోరూంలో ఈ నెలలో ఇప్పటి వరకు 45 వాహనాలు మాత్రమే విక్రయించామని చెబుతున్నారు. ఈ 20 రోజులలో 25 శాతం మాత్రమే అమ్మకాలు జరిగాయని శివ్‌సాయి హోండా మేనేజర్‌ శేషాద్రి తెలిపారు. మరో కంపెనీ షోరూంలో 100 నుంచి 120వరకు విక్రయిస్తుండగా.. అవి 30కే పరిమితమయ్యాయి. 130 నుంచి 150 వరకు బైక్‌ల అమ్మకాలు జరిగే మరో షోరూంలో 40వాహనాలు మాత్రమే సేల్‌ అయ్యాయి. కార్ల విషయంలో ఓ షోరూంలో ప్రతినెలా 80వరకు విక్రయించేవారు. ఈ నెలలో మాత్రం ఇప్పటి వరకు 6 మాత్రమే విక్రయించారు. ప్రతినెలా ఈ సమయానికి 40 నుంచి 45 వాహనాలు సేల్‌ చేసేవారమనీ, ఈసారి 15శాతం మాత్రమే జరిగిందని మహీంద్రా మేనేజర్‌ మస్తాన తెలిపారు. జీఎస్టీ ప్రభావంతో ఈసారి అమ్మకాలు తగ్గాయనీ, 22 నుంచి పెరుగుతాయని ఆశిస్తున్నామని కియ సేల్స్‌ హెచఓడీ ఎల్లప్ప చెప్పారు.

350 సీసీలోపు బైక్‌లపై తగ్గింపు ఇలా...

బైక్‌లకు సంబంధించి 350 సీసీలోపు మోటారు సైకిళ్ల ధరలు తగ్గుతాయి. వీటిపై 28 నుంచి జీఎస్టీ 18శాతానికి తగ్గనుంది. రాయల్‌ ఎనఫీల్డ్‌, కేటీఎం వంటి 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన సామర్థ్యం బైక్‌ల ధరలు పెరగనున్నాయి. వీటిపై ఇదివరకు 28 శాతం జీఎస్టీతోపాటు సెస్‌ విధించేవారు. ఇకపై సెస్‌ లేకుండా 40శాతం జీఎస్టీ పన్ను పరిధిలోకి వెళ్తాయి.

కార్ల ధరలు ఎలా ఉంటాయంటే...

కార్ల విషయంలోనూ 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. ఎలక్ర్టికల్‌ కార్లపై ప్రస్తుతం 5శాతం పన్ను విధిస్తున్నారు. ఈ రేటులో ఎలాంటి మార్పు ఉండదు. వీటిలో రూ.50వేల నుంచి రూ.1.90లక్షల వరకు తగ్గనున్నాయి. కియ కార్నివాల్‌ మోడల్‌ విషయంలో రూ.4.48లక్షలు తగ్గనుంది.

Updated Date - Sep 21 , 2025 | 12:46 AM