Share News

Amaravati: రాజధాని పనులకు రైట్‌ రైట్‌!

ABN , Publish Date - Mar 10 , 2025 | 03:15 AM

ఒకటి రెండు రోజుల్లో బిడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టర్లతో లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ) పూర్తవనుంది. ఆ ప్రక్రియ పూర్తయితే ఈ నెలాఖరు నాటికి పనులు పునఃప్రారంభం కానున్నాయి. వైసీపీ సర్కారు హయాంలో ఐదేళ్ల క్రితం ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినట్లవుతుంది.

Amaravati: రాజధాని పనులకు రైట్‌ రైట్‌!

ఈ వారంలోనే కాంట్రాక్టర్లతో ఎల్‌వోఏ పూర్తి

నెలాఖరుకు పునఃప్రారంభం కానున్న పనులు

17న అసెంబ్లీ, హైకోర్టు పనులకు ఏజెన్సీల ఖరారు

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం దాదాపుగా ఖరారయింది. ఒకటి రెండు రోజుల్లో బిడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టర్లతో లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ) పూర్తవనుంది. ఆ ప్రక్రియ పూర్తయితే ఈ నెలాఖరు నాటికి పనులు పునఃప్రారంభం కానున్నాయి. వైసీపీ సర్కారు హయాంలో ఐదేళ్ల క్రితం ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినట్లవుతుంది. పనుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

62 పనులకు టెండర్లు

అమరావతిలో 90 పనులు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 73 పనులకు పరిపాలనా ఆమోదం తెలిపింది. అందుకోసం రూ.48వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇప్పటికే రూ.40,000 కోట్ల విలువైన 62 పనులకు ఈ ఏడాది జనవరిలోనే సీఆర్డీఏ అధికారులు టెండర్లు పిలిచారు. ఫిబ్రవరిలోనే ఆ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమవుతాయని భావించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో జాప్యం జరిగింది. తాజాగా కోడ్‌ తొలగిపోవడంతో కాంట్రాక్టర్ల టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ బిడ్లను అధికారులు పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేస్తున్నారు. వాటికి సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ వెంటనే కాంట్రాక్టర్లతో ఎల్‌వోఏ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఈ నెలఖరుకల్లా కొన్ని పనులు, మిగిలినవి ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి. అయితే తాజా టెండర్లలో నాలుగు పనులకు ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్ల భవన సముదాయాల పనులకు పిలిచిన టెండర్లకు ఎవరూ స్పందించకపోవడంతో, మళ్లీ కొత్త టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.


అంతర్గత రహదారుల్లో జోరు

రాజధాని నిర్మాణంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన పనుల్లోనూ కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. అమరావతిలో అసంపూర్తిగా ఉండిపోయిన ఈ-2, ఈ-4, ఈ-5, ఈ-7 ఈ-11, ఈ-13, ఈ-15, ఎన్‌8, ఎన్‌13 రహదారుల నిర్మాణానికి రూ.2,903.76 కోట్లతో అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) ఫిబ్రవరి 15న బిడ్లను ఆహ్వనించింది. వాటి గడువు ఈ నెల 3తో ముగిసింది. అదేరోజున బిడ్లను పరిశీలించి అర్హులను నిర్ణయించాల్సి ఉండగా, కోడ్‌ కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. కోడ్‌ ముగియడంతో ఆ పనులూ ఈ వారంలో ప్రారంభం కానున్నాయి.

అసెంబ్లీ, హైకోర్టు టెండర్లకు 17వరకే గడువు

రాజధాని అమరావతి గుండెకాయగా ఉండే శాసనసభ, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ పనులకు ప్రభుత్వం వారం క్రితమే టెండర్లను ఆహ్వానించింది. రూ.1,816కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి టెండర్ల గడువు 17తో ముగియనుంది. అదేరోజు సాయంత్రం బిడ్లను తెరిచి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. ఆ పనులు కూడా మార్చి మూడోవారం నుంచే పరుగులు పెట్టనున్నాయి. 2018లో టీడీపీ హయాంలో అసెంబ్లీ భవనానికి రూ.555కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఇప్పుడది రూ.768 కోట్లకు పెరిగిది. హైకోర్టు శాశ్వత భవనానికి అప్పట్లో రూ.860 కోట్ల వ్యయాన్ని అంచనా వేయగా, ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు రూ.1,048 కోట్లకు చేరింది.


Read more :

Also Read: మెడికోకి బెదిరింపు.. నిందితుల కోసం గాలింపు
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?

Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 03:15 AM