Visakhapatnam: చురుగ్గా రుతుపవనాలు
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:40 AM
దేశంలోని అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రెండు, మూడు రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రెండుమూడ్రోజుల్లో అన్ని ప్రాంతాలకూ విస్తరణ
30న బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): దేశంలోని అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రెండు, మూడు రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం శుక్రవారం బలహీనపడింది. ఈనెల 29న పశ్చిమ బెంగాల్కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తోందని, దీని ప్రభావంతో 30వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం కోస్తాలో మేఘాలు ఆవరించగా, రాయలసీమలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.