Oil Refinery : వేగంగా రిఫైనరీ పనులు
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:33 AM
ఉండవల్లి నివాసంలో బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు.
మార్చి-ఆగస్టు మధ్య పర్యావరణ అనుమతుల సర్వే
డిసెంబరులో శంకుస్థాపనకు కార్యాచరణ
6 వేల ఎకరాల్లో భారీ రిఫైనరీ ఏర్పాటు
సీఎం చంద్రబాబుకు వివరించిన బీపీసీఎల్ ప్రతినిధులు
సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతో రావాలన్న ముఖ్యమంత్రి
త్వరలోనే అందజేస్తామన్న బీపీసీఎల్ ప్రతినిధులు
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి. రామాయపట్నంలో రూ. 95,000 కోట్లతో ఆయిల్ రిఫైనరీని ప్రారంభించేందుకు వీలుగా బీపీసీఎల్ పనులు ప్రారంభిస్తోంది. ఉండవల్లి నివాసంలో బీపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ ఏడాది డిసెంబరులో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడతామని ముఖ్యమంత్రికి ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో స్థాపిస్తున్న ఆయిల్ రిఫైనరీకి కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ భారీ రిఫైనరీని నిర్మించేందుకుగాను అటవీ, పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, ఇందుకోసం ఆరు నెలల పాటు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సర్వే నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సర్వే తర్వాత.. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సర్వే మార్చి నెలలో ప్రారంభమై ఆగస్టునాటికి పూర్తవుతుందన్నారు. ఈ భారీ రిఫైనరీకి కేంద్రం ఆమోదం తెలిపినందున అటవీ పర్యావరణ అనుమతుల్లో ఎలాంటి ప్రతికూలతా ఉండకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి రిపోర్టును సమర్పించాలని బీపీసీఎల్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. త్వరలోనే రిపోర్టును సమర్పిస్తామని వారు వెల్లడించారు. ఈ భారీ రిఫైనరీని సౌదీ ప్రభుత్వ రంగ సంస్థ సౌదీ ఆరాంకో భాగస్వామ్యంతో బీపీసీఎల్ స్థాపిస్తోంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
For AndhraPradesh News And Telugu News