Share News

సోనియా, రాహుల్‌ వల్లే మాకు పదవులు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:16 AM

తమ పదవులు, రాజకీయ భవితవ్యం... సోనియా, రాహుల్‌గాంధీ కష్ట ఫలితమేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీని హత్య చేసిన వారినే క్షమించేసిన గుణం సోనియా, రాహుల్‌, ప్రియాంకది అని గుర్తు చేశారు.

సోనియా, రాహుల్‌ వల్లే మాకు పదవులు

  • రాజీవ్‌గాంధీ హంతకులనే క్షమించిన గుణం వారిది .. వారి నీడలోనే మేమంతా రాజకీయంగా బతుకుతున్నాం

  • పార్టీలోకి ఎవరొచ్చినా

  • చేర్చుకోవాలన్నది ఏఐసీసీ నిర్ణయం

  • అందరం కట్టుబడి ఉండాలి

  • సంగారెడ్డి ఎమ్మెల్యే వస్తానన్నా

  • పార్టీలో చేర్చుకోవాలని చెప్పా: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): వారి నీడలోనే తామంతా రాజకీయంగా బతుకుతున్నామని పేర్కొన్నారు. ఏఐసీసీ సూచన మేరకు ఘర్‌ వాపసీ మొదలైందన్నారు. పార్టీలోకి ఎవరొచ్చినా చేర్చుకోవాలన్నది ఏఐసీసీ నిర్ణయమని, దానికి అందరం కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఘర్‌ వాపసీ కొనసాగుతోందని, కాంగ్రెస్‌ నుంచి ఇతర పార్టీల్లో చేరిన వారందరూ వెనక్కి వచ్చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ లాంటి వాళ్లూ వెనక్కు వచ్చారని గుర్తు చేశారు.

ఎన్నికల సందర్భంగా పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా పని చేసిన వారినీ చేర్చుకోవాలని అధిష్ఠానం సూచించిందని తెలిపారు. గతంలో సంగారెడ్డి నియోజకవర్గంలోనూ ఓ ఐదారుగురు తనకు వ్యతిరేకంగా పని చేస్తే వారిని పార్టీ సస్పెండ్‌ చేసిందన్నారు. వారు మళ్లీ పార్టీలోకి వస్తానంటే రమ్మని చెప్పానన్నారు. ఈ విషయంలోఏఐసీసీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని చెప్పారు. ‘‘సంగారెడ్డి ఎమ్మెల్యే.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరతానంటే ఏం చేద్దామని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ నా అభిప్రాయం అడిగిండు. వాళ్లు ఎవరైనా సరే అడిగితే చేర్చుకోండని చెప్పిన. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ అడిగితే అన్న ప్రశ్నకూ.. ఇచ్చేయండనే చెప్పిన’’ అని వెల్లడించారు. మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తేస్తామని అమిత్‌షా మాట్లాడుతున్నారని, మైనారిటీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Updated Date - Apr 27 , 2024 | 05:16 AM