Uttam: రెండేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:14 AM
రెండేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.4,605కోట్లకు సవరించగా, మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : రెండేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.4,605కోట్లకు సవరించగా, మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి స్థల సేకరణ ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ.37కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. ఈ వారంలో మరో రూ.22కోట్లు విడుదల చేస్తామన్నారు. ఖర్చు, ప్రయోజనాల శాతం ఆధారంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను క్రమపద్ధతిలో పూర్తి చేస్తామన్నారు. నీటిపారుదల శాఖ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని, తాము వచ్చాక 700 మందిని కొత్తగా నియమించాలని గుర్తు చేశారు.