Share News

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:08 PM

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడో వందే భారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Vande Bharat train) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే రేపు మార్చి 12న దేశవ్యాప్తంగా రూ.85,000 కోట్ల విలువైన 6 వేల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు దేశంలోని వివిధ స్టేషన్ల మధ్య 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయితే వీటిలో మన తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్-విశాఖపట్టణం(secunderabad to visakhapatnam) మధ్య నడవనున్న రెండో వందే భారత్‌ రైలును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభంకానున్న మూడో వందే భారత్ రైలు కావడం విశేషం.

ఈ ట్రైన్ ఈనెల 13 నుంచి ప్రయాణికులకు(passengers) అందుబాటులోకి రానుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది. గురువారం మినహా, రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మెరుగైన కనెక్టివిటీని అందించనుంది. రైలు నంబర్ 20707 ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి ఉదయం 05:05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 01:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మరో రైలు నంబర్ 20708 ట్రైన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 02:35 గంటలకు బయలుదేరి రాత్రి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.


ఈ వందే భారత్ రైలుతో పాటుగా 55 వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ స్టాల్స్, 3 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్, 4 గూడ్స్ షెడ్స్, ఒక పీఎం జన్ఔషధీ కేంద్రం, 2 రైల్ కోచ్ రెస్టారెంట్లను ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతోపాటు కాజీపేట్- బల్లార్షా, కాజీపేట్- విజయవాడ మధ్యన నిర్మిస్తున్న మూడో లైన్‌లో రెండు మార్గాల్లోని రెండు సెక్షన్లలో పూర్తయిన ట్రాక్‌లను ప్రారంభించనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పలు పనుల ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(modi), రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Congress: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Updated Date - Mar 11 , 2024 | 04:08 PM