25 వేల తనిఖీలు.. 4 వేల మందిపై చర్యలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:35 AM
తెలంగాణలో ఔషద నియంత్రణ సంస్థ ఈ ఏడాది విస్తృతంగా దాడులు నిర్వహించి భారీ ఎత్తున నిల్వలను స్వాధీనం చేసుకుంది.

ఈ ఏడాదిలో 573 కేసులు నమోదు
పెద్దఎత్తున దాడులు.. నిల్వల స్వాధీనం
ఔషధ నియంత్రణ సంస్థ నివేదిక
ఈ ఏడాదిలో పెద్ద ఎత్తున దాడులు
భారీగా నిల్వల స్వాధీనం
25,253 తనిఖీలు, 4,102 మందిపై చర్యలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఔషద నియంత్రణ సంస్థ ఈ ఏడాది విస్తృతంగా దాడులు నిర్వహించి భారీ ఎత్తున నిల్వలను స్వాధీనం చేసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి సరఫరా చేస్తున్న మందుల సరఫరాపై దాడులు నిర్వహించడంతో పాటు, హైదరాబాద్ కేంద్రంగా అక్రమ మందుల నిల్వలు, నకిలీ మందులు, అక్రమ మెడికల్ దుకాణాల వ్యాపారాలకు కళ్లెం వేసింది. అక్రమ మందుల నిల్వలను గుట్టురట్టు చేయడంతో పాటు, తయారీ, అమ్మకాలకు అడ్డుకట్ట వేసినట్లు ఔషద నియంత్రణ సంస్థ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు.
ఈ ఏడాది వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. 2024లో 573 కేసులు నమోదు చేసి భారీ స్థాయిలో మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 25,253 తనిఖీలు నిర్వహించి, 4,102 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ మందులను స్వాధీనం చేసుకోవడంతో పాటు నార్కోటిక్ డ్రగ్స్ అక్రమ మళ్లింపును అడ్డుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా తయారయ్యే నకిలీ మందులు, బ్రాండెండ్ కంపెనీల మందులు, యాంటీ కేన్సర్ నకిలీ మందులను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు కమలాసన్రెడ్డి వివరించారు.