Sangareddy: ఛాతీనొప్పి అంటే.. సంకెళ్లు వేసి ఆస్పత్రికి
ABN , Publish Date - Dec 13 , 2024 | 04:20 AM
సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ‘లగచర్ల’ రిమాండ్ ఖైదీ, గిరిజన రైతు గురువారం ఛాతీనొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ రైతు చేతికి అధికారులు సంకెళ్లు తగిలించి జైల్లోంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
లగచర్ల రిమాండు ఖైదీ, రైతు హీర్యా నాయక్పై దాష్టీకం
సంగారెడ్డి జైలు నుంచి బేడీలతో ఆస్పత్రికి తరలింపు
మా కొడుక్కి ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత: హీర్యా తండ్రి
పోలీసుల తీరుపై రేవంత్ సీరియస్.. విచారణకు ఆదేశం
సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డి సస్పెన్షన్
స్ట్రెచర్పై కాకుండా బేడీలు వేసి తీసుకెళ్తారా?: కేటీఆర్
సంగారెడ్డి అర్బన్, బొంరా్సపేట్, హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ‘లగచర్ల’ రిమాండ్ ఖైదీ, గిరిజన రైతు గురువారం ఛాతీనొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ రైతు చేతికి అధికారులు సంకెళ్లు తగిలించి జైల్లోంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. నెల క్రితం వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్నదాతలు జరిపిన ఆందోళనలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేశారన్న ఆరోపణలతో కొందరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని సంగారెడ్డి సమీపంలోని కంది జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీల్లో హీర్యా నాయక్ (45) అనే రైతుకు బుధవారం ఛాతీనొప్పి రావడంతో జైలు అధికారులు సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేయించి, జైలుకు తీసుకెల్లారు. మళ్లీ గురువారం ఛాతీనొప్పి రావడంతో ఆయన్ను మరోసారి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు 2డీ-ఈకో, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులన్నీ నార్మల్గా వచ్చాయి.
అయితే యాంజీయోగ్రామ్ తీసేందుకు, మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్కు తరలించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ వెల్లడించారు. సంగారెడ్డి ఆస్పత్రిలో హీర్యానాయక్ను ఆస్పత్రిలో తండ్రి రూప్లానాయక్, తల్లి లక్ష్మీబాయి, భార్య దేవీబాయి.. న్యాయవాదితో కలిసి వచ్చి పరామర్శించారు. తన కుమారుడికి ఏమైనా జరిగితే సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిదే బాధ్యత అని హీర్యానాయక్ తండ్రి రూప్లానాయక్ పేర్కొన్నారు. కుమారుడికి జరగకూడదనిది జరిగితే రేవంత్ సోదరుల ఇంటికి ముందుకే తీసుకొస్తామని హెచ్చరించారు. హీర్యానాయక్ను చూసేందుకు ఇతర కుటుంబసభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీనిపై గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, పట్టణ సీఐ రమేశ్తో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి ఆస్పత్రి వద్ద హీర్యానాయక్ను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు. కాగా లగచర్ల రైతుల బెయిల్ కోసం కృషిచేస్తున్నామని వారి తరఫున్యాయవాది వికారాబాద్కు చెందిన రాంచర్రావు పేర్కొన్నారు.
రేవంత్ క్రూర మనస్తత్వానికి నిదర్శనం: కేటీఆర్
గిరిజన రైతు హీర్యానాయక్ గుండెనొప్పితో బాధపడుతున్న సమయంలో ఆయన చేతికి బేడీలు వేయడంపై బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ జైపూర్లో విందులు, వినోదాలతో జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారని, తెలంగాణ గిరిజన రైతులు మాత్రం ప్రాణాపాయస్ధితిలో జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహూల్ గాంధీకి మనసుంటే, గిరిజనుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే.. ప్రభుత్వం పెట్టిన కేసులు రద్దు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము చెప్పిందే వినాలన్న అహంకారంతోనే, రేవంత్ రెడ్డి ఆయన సోదరులు గిరిజన రైతన్నల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. గుండెపోటు వచ్చిన వారిని స్ట్రెచర్ మీదనో, ఆంబులెన్స్లోనో కాకుండా బేడీలు వేసి తీసుకుని వచ్చి బెడ్పై పడుకోబెట్టడం క్షమార్హమైన విషయం కాదన్నారు. రాజ్యాంగంలోని 14, 19, 21 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమేనని, జైలు నిబంధనలు, బీఎన్ఎ్స ప్రకారం కూడా విచారణ ఖైదీల హక్కులను హరించడమేనన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరారు.
గవర్నర్ జోక్యం చేసుకుని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నందినగర్లోని తన ఇంట్లో గురువారం విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జైల్లో ఉన్న హీర్యానాయక్కు బుధవారం గుండెనొప్పి వస్తే వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని ఆరోపించారు. హీర్యానాయక్ గుండెనొప్పితో బాధపడుతున్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియనివ్వకుండా, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని ఆరోపించారు. తాము ఒత్తిడి చేయడంతోనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారని చెప్పారు. లగచర్ల కేసుల్లో అరెస్టు అయిన రాఘవేంద్ర, బసప్పకూడా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, తమ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డికి అనేక ఆరోగ్య సమస్యలున్నాయని పేర్కొన్నారు దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం హేయమైన చర్య అంటూ ఆయన ట్వీట్ చేశారు. రైతు హీర్యానాయక్ ఉగ్రవాదా? దోపిడీ దొంగనా? ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీఆర్ఎస్కు ఎలా తెలిసింది?
హీర్యానాయక్ను ఆస్పత్రికి తీసుకెళ్లేక్రమంలో చేతికి బేడీలు వేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి జైలుకు వెళ్లి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. పోలీసు విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడినట్లు సమాచారం. ఫలితంగా మొత్తం వ్యవహరంలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే కుట్ర కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రైతుకు బేడీలు వేసిన ఘటనపై సంగారెడ్డి జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా లగచర్ల ఈ కేసులో ఏ2గా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు సురేశ్ గురువారం ఉదయం ఏడుగంటలకు జైలు నుంచి తన ఇంటికి రెండు సార్లు ఫోన్ చేశారు. భార్య, బావమరిదితో మాట్లాడారు.. దీంతో సురేశ్ ద్వారానే హీర్యానాయక్ ఆస్పత్రికి తరలింపు విషయం బయటకు పొక్కి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీర్యానాయక్ ను ఆసుపత్రికి తీసుకుని వెళ్తున్న విషయం బయటున్న బీఆర్ఎస్ లేదా మీడియాకు ఎలా తెలుస్తుంది అనే కోణంలో విచారణ చేపట్టినపుడు సురేశ్ చేసిన ఫోన్లు అనుమానాలకు తావిస్తున్నాయి.
పోలీసుల తీరుపై సీఎం ఆగ్రహం
లగచర్ల రైతుకు బేడీలు వేసి, తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి, పూర్తి నివేదికను సమర్పించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోదని హెచ్చరించారు.
రైతుకు బేడీలు దుర్మార్గం : బీజేపీ
లగచర్ల రైతుకు బేడీలు వేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, జి. ప్రేమేందర్రెడ్డిలు విమర్శించారు. రైతు రాజ్యం తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం, ఈ ఘటనతో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నిరసనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.