Telangana: ఆ గ్రామానికి ఏమైంది.. 2 నెలల్లోనే 20 మంది మృత్యువాత..
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:31 PM
అది ప్రశాంతమైన పల్లెటూరు.. అందరూ కలివిడిగా ఉండేవారు. ఇంతలో ఆ ఊరిని మరణ భయం పట్టుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ మరణాలకు దెయ్యమే కారణమని జనాల్లో భయాందోళన మొదలైంది. మరి ఆ ఊర్లో ఏం జరిగింది.. ఏం జరుగుతోంది..
ములుగు జిల్లా: ఆ గ్రామానికి ఏమైంది? 2 నెలల వ్యవధిలోనే 20 మంది మృత్యువాత. ఇంతవరకు కనీసం ఆ గ్రామం వైపు తొంగి చూడని అధికారులు. ఇంకా అక్కడే ఉంటే మరణం తప్పదని భావిస్తూ కొంతమంది ఊరి విడిచి వెళ్తున్నారు. మంత్రి సీతక్కకి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించిన ఆ గ్రామం ప్రస్తుతం భయం గుప్పిట్లో ఉంది. తాము ఆపదలో ఉంటే సీతక్క కనీసం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దెయ్యం భయం..
ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్థులు దెయ్యం భయంతో గజగజ వణికిపోతున్నారు. 2 నెలల వ్యవధిలోనే సుమారు 20 మంది మృత్యువాత పడ్డారు. ఆసుపత్రికి వెళ్లిన జంగాలపల్లి వాసులు శవాలుగా తిరిగి వస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. నాలుగైదు రోజులకు ఒకరు గ్రామంలో చనిపోతున్నారని, ఏ క్షణంలో ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
గ్రామంలో హెల్త్ క్యాంపులు పెట్టి.. రక్త నమూనాలు సేకరించి వారి మరణాలకు కారణాలు ఏంటో తెలియాలని బాధిత గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామానికి కీడు సోకిందని, దెయ్యం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండానే వరుసగా మరణిస్తుండటంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామ దేవతలు, బొడ్రాయికి పూజలు చేయాలని గ్రామ పెద్దలు చర్చించుకుంటున్నారు.
Also Read:
నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్టీవ దేహం.. పలువురు ప్రముఖుల నివాళి
వారి సమస్యలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా.. హరీష్రావు ధ్వజం
‘వందే భారత్’ రైలు ఆహారంలో బొద్దింకలు
For More Telugu and National News