Share News

KTR: జనజాతర కాదు.. హామీల పాతర సభ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీరామారావు

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:34 PM

తుక్కుగూడ సాక్షిగా ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) ఆరోపించారు. కాంగ్రెస్ సభను ఉద్దేశించి ఆదివారం ఆయన ఓ పోస్ట్ చేశారు.

KTR: జనజాతర కాదు.. హామీల పాతర సభ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీరామారావు

హైదరాబాద్: తుక్కుగూడ సాక్షిగా ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) ఆరోపించారు. కాంగ్రెస్ సభను ఉద్దేశించి ఆదివారం ఆయన ఓ పోస్ట్ చేశారు.

"రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరుతో గారడీ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్లలో న్యాయ్ పేరిట కొత్త నాటకానికి తెరతీశారా. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు. నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతల ఆత్మహత్యలకు, నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది. గ్యారెంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంటలు నష్టపోతున్నారు. రుణమాఫీ కాక రైతులు అప్పుల పాలవుతున్నారు. తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారు.


మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారు. అన్నదాతల ఆర్తనాదాలు వినిపించడం లేదా? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా ? 200కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా ?చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా ? డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా ? 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణం కాంగ్రెస్.

TS News: బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే నిండా మునగడం ఖాయమని తేలిపోయింది. అందుకే వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ కువచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయం" అని కేటీఆర్ విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 03:37 PM